Begin typing your search above and press return to search.

తొలిసారి: ముగ్గురు మాజీ సీఎంలకు పద్మ పురస్కారాలు

By:  Tupaki Desk   |   26 Jan 2022 4:38 AM GMT
తొలిసారి: ముగ్గురు మాజీ సీఎంలకు పద్మ పురస్కారాలు
X
నిజంగానే నిజం. ఈసారి ప్రకటించిన పద్మ పురస్కారాలు రోటీన్ కు పూర్తి భిన్నమైనవి. ఒక ఏడాది ప్రకటించిన పద్మ పురస్కారాల్లో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులకు చోటు లభించటం ఒక ఎత్తు అయితే.. ఆ ముగ్గురు మూడు విభిన్న ధ్రువాలుగా అభివర్ణించాలి. ఇందులోని ఇద్దరితో అయితే.. సైద్ధాంతికంగా మోడీ సర్కారుకు అస్సలు పొసగదనే చెప్పాలి. అలాంటిది.. అవేమీ పట్టనట్లుగా.. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులకు పద్మ పురస్కారాల్ని ప్రకటించి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసేలా చేశారని చెప్పాలి.

రాజకీయ రంగంలో ఎంత విశిష్ఠ స్థానాల్ని సొంతం చేసుకున్నా.. అత్యుత్తమ పౌరపురస్కారాలకు సంబంధించి మాత్రం వారికి దక్కని పరిస్థితి. ఎక్కడిదాకానో ఎందుకు.. తెలుగువాడి ఘన కీర్తిని.. ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా చేసిన నేతగా సుపరిచితుడు.. తెలుగోడి ఆత్మగౌరవం సత్తా ఏమిటన్నది ఢిల్లీ పాలకులకు తెలిసేలా చేసిన ఎన్టీఆర్ విషయానికే వస్తే.. ఆయన భారతరత్న పురస్కారానికి సరిగ్గా సరిపోతారు. కానీ.. అదేం సిత్రమో కానీ.. ఆయనకు ఇప్పటివరకు అదేమీ దక్కలేదు.

రాజకీయ నేతగా ఎన్టీఆర్ ను వంక పెట్టటానికి వీల్లేదు. ఆయనపై రవ్వంత అవినీతి ఆరోపణలు కూడా రావు. ముక్కుసూటిగా ఉండటమేకాదు.. అవినీతికి ఆమడ దూరంలో ఉన్న ఆయన భారతరత్న పురస్కారానికి సరిగ్గా సరిపోతారు. కానీ.. ఆయనకు ఆ పురస్కారం మాత్రం దక్కలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించిన పద్మ పురస్కారాల్లో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల పేర్లు కనిపించటం ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది.

అందులో ఒకరు కాలధర్మం చేస్తే.. మరో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు జీవించి ఉన్నారు. తాజా పురస్కారాల విషయానికి వస్తే.. పద్మ పురస్కారాల్లో అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని మరణానంతరం కల్యాణ్ సింగ్ కు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు.. రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరించిన ఆయన.. బీజేపీ హిందుత్వ ఎజెండాతో అధికారాన్ని సొంతం చేసుకోగలిగారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. రెండుసార్లు పార్టీ నుంచి వీడిపోయి సొంతంగా పార్టీ పెట్టుకొని మళ్లీ పార్టీలోకి రావటం ఆయనకే చెల్లింది. అయినప్పటికీ.. ఆయనకు పద్మ పురస్కారాల్లో అత్యుత్తమ పద్మవిభూషణ్ ప్రకటించటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

పద్మ పురస్కారాల్లో రెండో అత్యుత్తంగా అభివర్ణించే పద్మభూషణ్ పురస్కారాల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి రెండు దఫాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన బుద్దదేశ్ భట్టాచార్యకు పురస్కారం ప్రకటించటం ఆసక్తికరంగానే కాదు.. అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసిందని చెప్పాలి. సైద్ధాంతికంగా బీజేపీకి బద్ధశత్రువుగా అభివర్ణించే కమ్యునిస్టు పార్టీకి చెందిన బుద్దదేవ్ ను బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పురస్కారాన్ని ప్రకటించటం ఆసక్తికరంగా మారింది.

ఇక.. మరో ఆసక్తికరమైన ప్రకటన.. కాంగ్రెస్ సీనియర్ నేత.. జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా వ్యవహరించిన గులాం నబీ అజాద్ కు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. తన రాజకీయ జీవితంలో కాంగ్రెస్ నేతగా సుపరిచితుడు.. బీజేపీకి బద్ధ శత్రువుగా వ్యవహరించే గులాం నబీ అజాద్ కు పద్మభూషణ్ పురస్కారం లభించటం చూసినప్పుడు.. ఇలాంటి మేజిక్ లు మోడీకి మాత్రమే సాధ్యమని చెప్పకతప్పదు. గులాం నబీ అజాద్ ను పదే పదే పొగిడే మోడీ.. మొత్తానికి తనకున్న సానుకూలతను పద్మ పురస్కారంతో తెలియజేశారని చెప్పాలి. ఏమైనా.. ఒక ఏడాదిలో ప్రకటించిన పద్మ పురస్కారాల్లో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులకు ఓకే జాబితాలో చోటు లభించటం ఇదే తొలిసారి అన్న మాట వినిపిస్తోంది.