Begin typing your search above and press return to search.

ఆర్ఎస్ఎస్ చీఫ్ పై మళ్లీ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   16 Oct 2021 9:08 AM GMT
ఆర్ఎస్ఎస్ చీఫ్ పై మళ్లీ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
X
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన విమర్శలు కాకరేపుతున్నాయి. విజయదశమి సందర్భంగా మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఓవైసీ మండిపడ్డాడు. మోహన్ భగవత్ విజయదశమి ప్రసంగం అబద్దాలు, సగం సత్యాలతో నిండి ఉందని ఓవైసీ ఆరోపించారు. జనాభా నియంత్రణ విధానం, ఆర్టికల్ 370 రద్దు ఇతర అంశాలపై భగవత్ వ్యాఖ్యలను తూర్పారపట్టారు.

ముస్లింలు, క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే అబద్ధాన్ని ఆయన పునరావృతం చేశారని.. కానీ ముస్లిం జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉందని ఓవైసీ పేర్కొన్నారు. బాల్య వివాహాలు, సెక్స్ సెలక్టివ్ అబార్షన్ ల వంటి సామాజిక దూరాచారాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని ఎంఐఎం చీఫ్ అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ లో ప్రజలు ప్రయోజనాలు పొందుతున్నారని భగవత్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఈ ఏడాది జరిగిన పౌరహత్యలను ఓవైసీ ప్రస్తావించారు. హత్యులు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించిన ఓవైసీ.. దీనివల్ల ఇంటర్నెట్ షట్ డౌన్ లు, సామూహిక నిర్బంధాలతో కశ్మీర్ ఒక రావణకాష్టంలా మారిందని విమర్శించారు. సగం నిజం, సగం అబద్దం చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగపడడం ఉండదని ఓవైసీ విమర్శించారు.

విజయదశమి సందర్భంగా నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సంఘ్ శ్రేణులను ఉద్దేశించి మోహన్ భగవత్ ప్రసంగించారు. పాకిస్తాన్, తాలిబన్, ఉగ్రవాదం నుంచి జనాభా నియంత్రణ వరకు పలు అంశాలపై మోహన్ భగవత్ మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ఏటా నిర్వహించే ఈ వేడుకలకు ఈసారి ఇజ్రాయెల్ కాన్సులేట్ జనరల్ కొబ్బి పొషానీ హాజరయ్యారు.

జనాభా నియంత్రణ విధానాన్ని తీసుకురావాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని దాన్ని రూపొందించాలని సూచించారు. ఇది అందరికీ సమానంగా వర్తింపచేయాలని.. జనాభా అసమతౌల్యత పెద్ద సమస్యగా మారిందని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ లో ప్రజలను భయపెట్టడం కోసం ఉగ్రవాదులు హింసను ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు.