Begin typing your search above and press return to search.

దారుణమైన ప్లానింగ్: వాకింగ్ చేయిస్తూ భర్తను చంపేసింది

By:  Tupaki Desk   |   19 July 2021 4:41 AM GMT
దారుణమైన ప్లానింగ్: వాకింగ్ చేయిస్తూ భర్తను చంపేసింది
X
కలలో కూడా ఊహించలేని దారుణాలు ఈ మధ్యన అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. కట్టుకున్న భర్తను.. ఏళ్ల తరబడి సంసారం చేస్తున్నోడిని.. మరొకడితో జీవితాన్ని పంచుకోవటం కోసం దారుణంగా చంపేయిస్తున్న ఉదంతాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి దారుణమే విశాఖపట్నంలో చోటు చేసుకుంది. పదో తరగతి స్నేహితుడితో మొదలైన రిలేషన్.. పక్కదారి పట్టటమే కాదు.. భర్తను దారుణంగా చంపేయించిన వైనం వింటే షాక్ కు గురి కావటం ఖాయం. ఎంత వద్దనుకుంటే మాత్రం.. ఇంతలా చంపేయించాల్సిన అవసరం ఏమిటి? అన్న సందేహం కలుగక మానదు. టీవీ సీరియల్స్ ప్రభావమో.. లేదంటే తమకు మించిన తెలివి మరెవరికీ ఉండదన్న ఓవర్ కాన్ఫిడెన్సో కానీ.. మర్డర్ ప్లాన్ చేసి.. అడ్డంగా బుక్ అయిన విశాఖ యువతి వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..

మూడు రోజుల క్రితం విశాఖలోని మధురవాడకు చెందిన సతీశ్.. రమ్యలు భార్యభర్తలుగా జీవిస్తున్నారు. ఏళ్ల క్రితం పెళ్లైన వారి జీవితంలో అనుకోని రీతిలో వాట్సాప్ గ్రూప్ ఒకటి కలకలం రేపింది. ఇటీవల కాలంలో చిన్ననాటి స్నేహితులు రీయూనియన్ కావటం తెలిసిందే. అదే రీతిలో తాను పదో తరగతి చదివే స్కూల్ టీంకు చెందిన వాట్సాప్ గ్రూప్ లో భాగమైంది రమ్య. ఆ క్రమంలో తన పాత స్నేహితుడు బాషా ఆమె జీవితంలోకి వచ్చాడు. పదో తరగతి చదివే టైంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. తర్వాత బ్రేక్ అయ్యింది. పెళ్లి అయిన ఇన్నాళ్లకు మళ్లీ పరిచయమైన బాషాతో వివాహేతర సంబంధం షురూ కావటం.. ఇద్దరు కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు.

ఇందుకోసం రెండు రోజుల పాటు భారీ రెక్కీ వేశారు. సీసీ కెమేరాలు అన్నవి లేకుండా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. ఎక్కడ చంపాలి? ఎలా చంపాలి? అని పక్కా ప్లాన్ చేశారు. ఎలాంటి తప్పు దొర్లకుంటే.. భర్తను వదిలించుకున్న తర్వాత ఇద్దరు ఎంచక్కగా ఉండొచ్చని ప్లాన్ చేశారు. వారు అనుకున్నట్లే.. హత్యను చేయగలిగారు కానీ.. పోలీసుల విచారణలో నిజాన్ని దాచలేకపోయారు. సీసీ కెమేరాలు లేని.. నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకొని వాకింగ్ కు భర్త సతీష్ తో పాటు కలిసి వెళ్లింది రమ్య.

ఆర్థిక లావాదేవీలతో తేడా వచ్చి.. తన భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారని.. వారు రాడ్ తో కొట్టి చంపుతున్న వేళలో.. తాను భర్తకు ఆరు అడుగుల దూరంలో ఉన్నట్లుగా చెప్పింది. తాను ముందు నడుస్తుంటే.. భర్త కాస్త వెనక ఉన్నాడని.. రక్తం మడుగులో పడిన భర్తను రక్షించుకోవటానికి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని.. వేదనతో వెక్కివెక్కి ఏడ్చి పోలీసులకు చెప్పింది. ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదుచేసిన రమ్య తీరుపై మొదట్లో అనుమానాలు కలగలేదు.

అయితే.. అరడుగుల దూరంలో ఉన్న ఆమె.. భర్తపై దాడి జరుగుతున్న సమయంలో ఎందుకు ప్రతిఘటించలేదు?అన్న సందేహానికి వచ్చిన పోలీసులు.. వెంటనే ఆ దిశగా విచారణ షురూ చేశారు. రమ్యను అదుపులోకి తీసుకొని విచారణ షురూ చేశారు. ఒకట్రెండు ప్రశ్నలకు తేడా కొట్టటంతో తమదైన శైలిలో ప్రశ్నించేసరికి.. నిజం తన్నుకుంటూ బయటకు వచ్చేసింది. పదో తరగతి స్నేహితుడైన బాషాతో ఉన్న రిలేషన్ తోనే భర్తను అడ్డు తొలగించుకోవాలని తామిద్దరం ప్లాన్ వేసినట్లుగావెల్లడించింది. చిన్ననాటి స్నేహితుడితో వివాహేతర సంబంధం మత్తులో.. ఎలాంటి తప్పు చేయని భర్తను దారుణంగా చంపించిన రమ్య ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది.