Begin typing your search above and press return to search.

సీఎం అపాయింట్ మెంట్ కోసం ధర్నా.. నిరసన

By:  Tupaki Desk   |   9 Aug 2015 10:01 AM IST
సీఎం అపాయింట్ మెంట్ కోసం ధర్నా.. నిరసన
X
ప్రజా సమస్యల మీద పోరాటం చేయటం మామూలే. కానీ.. ఒక రాజకీయ పార్టీ ఒక చిత్రమైన అంశం మీద నిరసన.. ధర్నా చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వాలని.. ప్రజా సమస్యలు చర్చించేందుకు సమయం ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది.

గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు.. ప్రజా సమస్యల మీద చర్చ జరపటానికి విపక్షాలకు ఎప్పుడు అపాయింట్ మెంట్ ఇస్తారని ప్రశ్నించారు. నాలుగు కోట్ల మంది ప్రజలను కేసీఆర్ అవమానిస్తున్నారని.. బంగారు తెలంగాణ అంటే అన్ని వర్గాలు.. నేతలు.. ప్రజలు.. పార్టీలను సమ్మెకు వెళ్లేలా చేయటమా అని ప్రశ్నించారు.

పారిశుద్ధ్య కార్మికులను తిరిగి పనుల్లోకి తీసుకోవాలన్న డిమాండ్ తో గత కొద్దికాలంగా నిరసన నిర్వహించటం తెలిసిందే. దీన్లో భాగంగా శుక్రవారం సీఎం దగ్గరకు వెళ్లిన విపక్ష నేతలకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. విపక్ష నేతల్ని కలుసుకునేందుకు కూడా ఇష్టపడని ముఖ్యమంత్రి.. వారికి అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటంతో గంటల తరబడి వెయిట్ చేసి నిరాశతో వెనుదిరగటం తెలిసిందే.

ప్రజా సమస్యల కోసం పోరాడటం రాజకీయ పార్టీలకు మామూలే. కానీ.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్ర అపాయింట్ మెంట్ కోసం కూడా పోరాడాల్సిన పరిస్థితి. విపక్షాలకు అపాయింట్ మెంట్ ఇవ్వటం కూడా అంత కష్టమైన.. క్లిష్టమైన వ్యవహారమా కేసీఆర్..?