Begin typing your search above and press return to search.

తెలంగాణ‌కు సంకెళ్లు వేసిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   12 May 2017 10:28 AM GMT
తెలంగాణ‌కు సంకెళ్లు వేసిన కేసీఆర్‌
X
ఖమ్మం మార్కెట్ యార్డులో విధ్వంసం కేసులో రైతులపై కేసులు న‌మోదు చేసి వారిని అరెస్టు చేయడమే కాకుండా సంకేళ్లు వేసి కోర్టుకు తీసుకురావడాన్ని అధికార పార్టీ నేత‌లు త‌ప్ప‌ తెలంగాణ‌లోని అన్నివ‌ర్గాలు మూకుమ్మ‌డిగా ఖండిస్తున్నాయి. ఈ నిర్ణ‌యం రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న‌ది కాద‌ని పోలీసుల అత్యుత్సాహమ‌ని పేర్కొంటూ బాధ్యుల‌ను స‌స్పెండ్ చేసిన‌ప్ప‌టికీ విప‌క్షాలు మాత్రం రాష్ట్ర ప్ర‌భుత్వంపై త‌మ ఆరోప‌ణ‌లు కొన‌సాగిస్తున్నాయి. తాజాగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ తొలగింపును నిరిస్తూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద విప‌క్ష పార్టీల‌న్నీ నిర‌స‌న‌లు తెలిపాయి. గన్ పార్క్ వద్ద మౌన దీక్షలో పాల్గొన్న ప‌లువురు విప‌క్ష నేత‌లు దీక్ష ముగిసిన తరువాత విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ స‌ర్కారుపై ప‌లువురు నిప్పులు చెరిగారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని మండిప‌డ్డారు. ఇక్కడి మిర్చి రైతులపై కేసులు, వారికి సంకెళ్లు వేయడం వంటి చ‌ర్య‌లు సంక్షేమ ప్ర‌భుత్వానికి నిద‌ర్శ‌నం అనుకోవాలా అంటూ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నిల‌దీశారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ తొలగింపును ఎట్టిపరిస్థితుల్లోనేూ అడ్డుకుంటామన్నారు. అన్ని వర్గాల ప్రజలూ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. స‌రైన స‌మ‌యంలో స‌రైన రీతిలో స్పందిస్తార‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు. ధర్నా చౌక్ ఎత్తివేతకు నిరసనగా విపక్షాల మౌన దీక్ష కార్యక్రమంలో జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్‌ కోదండరాం మాట్లాడుతూ నిన్న సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకువచ్చింది ఒక్క ఖమ్మం రైతులను మాత్రమే కాదని, యావత్ తెలంగాణ రైతాంగానికీ కేసీఆర్ సర్కార్ సంకెళ్లు వేసిందని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్ర ప్ర‌భుత్వం తీరును ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని తెలిపారు. నిరసన తెలిపే హక్కును కాలరాయాల‌ని చూడ‌టం స‌రికాద‌ని తెలిపారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడ‌ర్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం మార్కెట్ యార్డులో విధ్వంసం కేసులో రైతులపై అక్రమంగా కేసులు బనాయించి వారిని అరెస్టు చేయడమే కాకుండా సంకేళ్లు వేసి కోర్టుకు తీసుకురావడానికి పూర్తి బాధ్యత మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీష్ రావులేనని ఆయన ఆరోపించారు. ఈ మంత్రులే వారు రైతులు కాదు రౌడీలని పోలీసులను రెచ్చగొట్టారని ఆరోపించారు. రైతులకు బేడీలు వేసిన సంఘటనలో కింది స్థాయి పోలీసులపై వేటు వేయడం కాదని, ఈ పరిస్థితికి కారణమైన మంత్రులను కేబినెట్ నుంచి బర్త‌రఫ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతే రాజంటే రైతులకు బేడీలు వేసి కోర్టుల చుట్టూ తిప్పుతారా అని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ పరిపాలనకు హాలీడే ఇచ్చి ఢిల్లీకి మకాం మార్చిందా అని రేవంత్ ఎద్దేవా చేశారు. సీపీఐ కార్య‌ద‌ర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూనియంతృత్వ ధోరణితో వ్యవహరించే వారు చరిత్రలో కలిసిపోతారని జోస్యం చెప్పారు. ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ ను తొలగించడం అప్రజాస్వామికమని అన్నారు. నిరసన తెలిపే హక్కును కాలరాయడమేనని త‌మ్మినేని దుయ్య‌బ‌ట్టారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/