Begin typing your search above and press return to search.

ఏపీలో కాంగ్రెస్ కు మిగిలింది ఒకేఒక్కరు

By:  Tupaki Desk   |   7 Feb 2017 7:14 AM GMT
ఏపీలో కాంగ్రెస్ కు మిగిలింది ఒకేఒక్కరు
X
ఒక్క నిర్ణయం ఒక పార్టీ ఫ్యూచర్ మొత్తాన్ని మార్చేస్తుందనటానికి ఏపీ కాంగ్రెస్ పార్టీనే అతిపెద్ద ఉదాహరణగా చెప్పాలి. ఏపీని రెండు ముక్కలుగా చేస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయం ఏపీ కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేసింది. పదేళ్లు ఏకఛత్రాధిపత్యం అన్నట్లుగా పవర్ ను సొంతం చేసుకున్న పార్టీ ప్రస్తుత పరిస్థితి గురించి వింటే అవాక్కు అవ్వాల్సిందే.

విభజన అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క ఎంపీ నియోజకవర్గంలో కానీ.. అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ గెలిచింది లేదు. రానున్న మరికొన్నేళ్లలో గెలుస్తారన్న నమ్మకం కూడా లేని పరిస్థితి. విభజన నేపథ్యంలో ఇప్పటికే కీలక సభలకు ఏపీ నుంచి ప్రాతినిధ్యం లేని వేళ.. తాజాగా మరో ఇబ్బందికర పరిస్థితి ఆ పార్టీ ఎదుర్కొంటోంది. ఈ ఏడాది మార్చి.. మే నాటికి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి చెందిన 21 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది.

పదవీ కాలం ముగియనున్న నేతల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మండలి ఛైర్మన్ చక్రపాణి.. విపక్ష నేత సి. రామచంద్రయ్యలు ఉన్నారు. ఈ ఇద్దరి నిష్క్రమణ తర్వాత ఆ పార్టీ తరఫున ఉండేది ఒక్క రత్నబాయ్ మాత్రమే. ఎమ్మెల్యేలుగా ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి లేని నేపథ్యంలో.. ఏపీ తరఫున చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం రత్నభాయ్ కి తప్పించి మరెవరికీ లేదని చెప్పాలి. ఏపీలో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా నిలిచిన కాంగ్రెస్ కు ఇలాంటి దుస్థితి వస్తుందని ఏకాంగ్రెస్ నేతా ఊహించి ఉండరు. విధానపరంగా తీసుకునే నిర్ణయాల్లో తేడా వస్తే పరిస్థితులు ఎంత దారుణంగా మారతాయనటానికి ఏపీలో కాంగ్రెస్ పార్టీనే పెద్ద ఉదాహరణగా చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/