Begin typing your search above and press return to search.

గవర్నరు చేయలేనిది ఉల్లిపాయ చేసింది

By:  Tupaki Desk   |   16 Sep 2015 8:55 AM GMT
గవర్నరు చేయలేనిది ఉల్లిపాయ చేసింది
X
రాష్ట్ర విభజన తరువాత ఏపీ - తెలంగాణల మధ్య ప్రతిదీ వివాదమై కూర్చుంటోంది.. ఒకటా రెండా ఎన్నో సమస్యలుగా మారి ఇప్పటికి పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయి. వివిధ అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యల పరిష్కారానికి ఉమ్మడి గవర్నరు నరసింహన్ ఎంత చొరవ చూపినా, ఎన్నిసార్లు ఇద్దరు ముఖ్యమంత్రులతో సమావేశమైనా పరిష్కారాలు దొరకలేదు. రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారులు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది.

ఎంసెట్ పరీక్షల నిర్వహణ, విద్యుత్ వాటాలు వంటి చాలా వివాదాలు రెండు రాష్ట్రాల మధ్య రచ్చరచ్చ లేపాయి. ఆ తరువాత రెండు రాష్ట్రాల మధ్య రవాణా పన్ను కూడా కొద్ది రోజుల పాటు పెద్ద వివాదమైంది. చివరకు తెలంగాణ ఏమాత్రం తగ్గకుండా ఏపీ వాహనాలకు రవాణా పన్ను వేయడంతో ఏపీ కూడా అదే పనిచేయడం మొదలుపెట్టింది. ఈ సమస్య పరిష్కారానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వీలవలేదు. గవర్నరు వద్ద పంచాయితీ జరిగినా.. ఆయన చెప్పినా కూడా తెలంగాణ వినలేదు. కానీ.. ఇప్పుడు అనుకోనివిధంగా ఆ సమస్యకు కొంతమేరకు పరిష్కారం దొరుకుతోంది. అయితే.... ఆ పరిష్కారం ఉల్లిపాయ వల్ల దొరికిందంటే ఆశ్చర్యపోవాల్సిందే.

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్నెళ్లుగా నలుగుతున్న రవాణా వాహనాల ప్రవేశ పన్ను వివాదానికి ఉల్లిపాయ ముగింపుపలకనుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల అధికారుల మధ్య ఒప్పందం కుదరబోతోంది. ఈ ఏడాది మార్చి 31 తరువాత రవాణా పన్ను వేయాలని తెలంగాణ నిర్ణయించడం... ఏపీ వద్దనడం.. అయినా తెలంగాణ పన్ను విధించడం తెలిసిందే. దాంతో ఏపీ కూడా పన్ను వేసింది. దీంతో రెండు రాష్ట్రాల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

అయితే... కొద్ది వారాలుగా ఉల్లి ధరలు దేశంలో అధికమయ్యాయి. ఏపీ, తెలంగాణల్లోనూ ఉల్లి కొరత తీవ్రంగా ఉంది. ఏపీలోని కర్నూలు రైతుల నుంచే రెండు రాష్ట్రాలూ అధికశాతం సరకు కొంటున్నాయి. మిగతాది నాసిక్ నుంచి తెప్పించుకుంటున్నాయి. కర్నులు నుంచి తెచ్చే సరకు విషయంలో ఏపీకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా... తమ వాహనాలకు ఏపీ రవాణా పన్ను వేస్తుండడంతో తెలంగాణకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఈ ప్రభావం వల్ల కిలో ఉల్లి పై రూ.6 వరకు రవాణా భారం పడుతోందట. కానీ, రైతు బజార్లలో రూ.20 కే ప్రభుత్వం కిలో ఉల్లిని ఇస్తుండడంతో ఈ రవాణా భారం కూడా నేరుగా ప్రభుత్వంపైనే పడుతోంది. ఈ దెబ్బకు తెలంగాణకు తెలివొచ్చింది. సమస్య పరిష్కారం కోసమంటూ ఏపీ అధికారులను సంప్రదించారు. ఏపీ రవాణా శాఖ అధికారులతో మాట్లాడారు. ఒక ఒప్పందానికి వచ్చారు... దీని ప్రకారం... ఒక రాష్ట్ర వాహనం రెండో రాష్ట్రంలో ప్రవేశిస్తే రూ.5 వేలు చెల్లించాలి. అటూఇటూ తిరిగిన వాహనాలు ఎన్నో లెక్కిస్తారు. చివరకు ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత ఏప్రిల్ లో ఆ సొమ్మును రెండు రాష్ట్రాలూ సమానంగా పంచుకుంటారు. అయితే... దీనికి ప్రభుత్వాల పరంగా ఇంకా ఆమోద ముద్ర పడాల్సి ఉంది. ఆ స్టేజిలో ఒకే అయితే.. అక్టోబరు 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది.