Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: 'ఒంగోలు' గిత్త ఎవరో..?

By:  Tupaki Desk   |   2 April 2019 8:10 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్:  ఒంగోలు గిత్త ఎవరో..?
X
పార్లమెంట్ నియోజకవర్గం: ఒంగోలు

టీడీపీ : సిద్ధా రాఘవరావు
వైసీపీ :మాగుంట శ్రీనివాసులు రెడ్డి

కరువుతో కొట్టుమిట్టాడుతున్న ప్రకాశం జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా సాగుతుంటుంది. ఇక్కడి సమస్యలు పట్టించుకోని నాయకులు రాజకీయం పైనే ఎక్కువగా దృష్టి పెడుతారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయినా స్థానికులు కానివారే ఎంపీలుగా ఇక్కడ కొనసాగుతుండడం విశేషం. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా సిద్ధా రాఘవరావు - వైసీపీ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరికి ఈ స్థానం కొత్తే కావడంతో నియోజకవర్గ ప్రజలు ఎవరిని గెలిపిస్తారోనన్న ఆసక్తి మొదలైంది.

* ఒంగోలు నియోజకవర్గం చరిత్ర:

అసెంబ్లీ నియోజకవర్గాలు: ఎర్రగొండపాలెం - దర్శి - ఒంగోలు - కొండపి - మార్కాపురం - గిద్దలూరు - కనిగిరి

ఓటర్లు:14 లక్షల 70 వేలు

1952లో నియోజకవర్గం ఏర్పడింది. మొదటిసారి ఇక్కడ జరిగిన ఎన్నికల్లో పీసపాటి వెంకట రాఘవయ్య స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తరువాత 11 సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలిచారు. గత ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులపై 15 వేల మెజారిటీతో గెలుపొందారు.

*టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి..

1998లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మాగుంట శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్‌ తరుపున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఏడాది తరువాత 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కరుణం బలరాం పై ఓటమి చెందారు. 2004 - 2009 ఎన్నికల్లో వరుసగా మళ్లీ విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చి పోటీ చేసిన మాగుంట వైసీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయినా మాగుంట పై ఉన్న నమ్మకంతో చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవినిచ్చారు. కానీ నెలకిందట ఆయన వైసీపీ గూటిలో చేరారు. ఆ పార్టీ తరుపున పోరు లోకి దిగుతున్నారు. సుధీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న ఆయన ప్రకాశం జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారు. సౌమ్యుడు - వివాదరహితుడిగా పేరు తెచ్చుకోవడంతో వ్యక్తిగతంగా ఆయనకు ఎక్కువగానే ఫాలోయింగ్‌ ఉంది. అయితే సిట్టింగ్‌ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి జగన్ టికెట్ నిరాకరించడంతో మాగుంటకు సహకరించే అవకాశాలు లేనట్లే కనిపిస్తోంది. ఆయనకు టికెట్‌ దక్కకపోవడంతో కాస్తా అసంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం.

*అనుకూలతలు:

-సిట్టింగ్‌ ఎంపీ స్థానం వైసీపీదే కావడం
-కేడర్‌ బలంగా ఉండడం
-వరుసగా రెండుసార్లు ఎంపీగా విజయం సాధించడం

* ప్రతికూలతలు:

-పార్టీలు ఎక్కువగా మారుస్తుండడం
-మాగుంటకు సిట్టింగ్‌ ఎంపీ సుబ్బారెడ్డి సహకరించకపోవడం

* మంత్రి నుంచి ఎంపీ బరిలోకి సిద్ధా రాఘవరావు ..

2014 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన సిద్ధా రాఘవరావు పార్టీ అధినేత చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉన్నారు. దీంతో ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు చంద్రబాబు. ఈ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డికే టికెట్‌ ఇస్తామని నిర్ణయించుకున్నా చివరి సమయంలో ఆయన వైసీపీకి చేరారు. దీంతో పార్టీ అధినేత షాక్‌ తిన్నారు. అయినా అప్పటికప్పుడు మాజీ మంత్రిగా పనిచేసిన సిద్ధా రాఘవరావును ఎంపీ బరిలోకి దింపారు. చంద్రబాబు మాటను జవదాటని సిద్ధా ప్రస్తుతం ప్రచార పర్వంలో మునిగిపోయారు. ఈ నియోజకవర్గంలోని కొన్ని స్థానాల్లో పార్టీ బలంగా ఉండడంతో పాటు ఆర్యవైశ్య - బీసీ - ఎస్సీ ఓట్లు కలిసివచ్చే అవకాశం ఉంది.

*అనుకూలతలు:

-లోక్‌ సభ పరిధిలో టీడీపీ బలంగా ఉండడం
-మంత్రిగా పనిచేసిన అనుభవం
-పార్టీ అధినేత అండదండలు ఎక్కువగా ఉండడం

* ప్రతికూలతలు:

-తొలిసారి ఎంపీగా బరిలోకి
-నాన్‌ లోకల్‌ అభ్యర్థి కావడం

*నాన్ లోకల్ ఇష్యూ.. గెలుపు ఎవరిదో..

ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో నెల్లూరు నుంచి వచ్చిన అభ్యర్థులే బరిలో ఉన్నారు. 2014లో ఎంపీగా గెలిచిన వైవీ సుబ్బారెడ్డి మినహా దాదాపు నాన్‌ లోకల్‌ అభ్యర్థులే ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ - వైసీపీ నుంచి ఇద్దరూ స్థానికులు కారు. దీంతో ఇక్కడి ప్రజలు ఎవరిపై నమ్మకం ఉంచుతారో చూడాలి..