Begin typing your search above and press return to search.

బోయిన్ పల్లికి ఏమైంది? ఈసారి ఏసీ సిలిండర్ పేలింది.. ఒకరి దుర్మరణం

By:  Tupaki Desk   |   11 March 2021 8:45 AM GMT
బోయిన్ పల్లికి ఏమైంది? ఈసారి ఏసీ సిలిండర్ పేలింది.. ఒకరి దుర్మరణం
X
రెండు రోజుల క్రితం హైదరాబాద్ మహానగరంలోని బోయిన్ పల్లిలో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన వైనం షాకింగ్ గా మారింది. సాధారణంగా సిలిండర్ పేలటం అంటూ ఉండదు.. లీక్ కావటంతో ప్రమాదం జరుగుతుంది. ఈ ఉదంతంలో అందుకు భిన్నంగా పేలిన గ్యాస్ సిలిండర్ కారణంగా ముగ్గురు గాయపడితే.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇది జరిగిన రోజు తర్వాత అంటే.. బుధవారం రాత్రి అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ కు చెందిన సలీం.. హైదరాబాద్ లోని రాంనగర్ కు చెందిన సమీర్ లు ఒక ప్రైవేటు కంపెనీలో ఏసీ టెక్నీషియన్లుగా పని చేస్తున్నారు.

బాలానగర్ లో సర్వీసింగ్ చేసేందుకు ఏసీ కంప్రెషర్ ను బైక్ మీదకు తీసుకెళుతున్నారు. ఈ క్రమంలో వారు బైక్ మీద బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న చౌరస్తా నుంచి బాలానగర్ వైపు వెళ్లే సమయంలో.. ఇద్దరి మధ్య పెట్టిన కంప్రెషర్ (చిన్న సిలిండర్ లాంటిది) ఒక్కసారిగా పేలింది.

ఈ ధాటికి బైక్ వెనుక కూర్చున్న సలీం అక్కడికక్కడే మరణించాడు. బండి నడుపుతున్న సమీర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతడ్ని హుటాహుటిన గాంధీకి తరలించారు. ఏసీ కంప్రెషర్ పేలిన వైనం ఇప్పటివరకు తెలీదని చెబుతున్నారు. ఇది ఎలా పేలిందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రోజువ్యవధిలో రెండు సందర్భంలో పేలిన గ్యాస్ సిలిండర్లు రెండూ బోయిన్ పల్లిలోనే కావటం గమనార్హం.