Begin typing your search above and press return to search.

జనసేన కార్యకర్త అరాచకం: వృద్ధురాలి ఆస్తి కాజేసేందుకు యత్నం

By:  Tupaki Desk   |   25 Jun 2020 5:15 AM GMT
జనసేన కార్యకర్త అరాచకం: వృద్ధురాలి ఆస్తి కాజేసేందుకు  యత్నం
X
పవన్ కల్యాణ్ పేరుతో ఓ జనసేన పార్టీ కార్యకర్త ఏకంగా వృద్ధురాలి ఆస్తి కాజేసేందుకు యత్నించాడు. ఆమె సంతకాలు సేకరించి ఆమె ఇంటిని విక్రయానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న ముసలామె పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో చోటుచేసుకుంది.

విజయవాడ పాయకాపురం సుందరయ్యనగర్ ప్రాంతంలో వృద్ధురాలు లక్ష్మి నివసిస్తోంది. భర్త ఎప్పుడో చనిపోగా.. కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపింది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు హైదరారాబాద్‌ లో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. దీంతో ఆమె ఒక్కతే విజయవాడ లో ఉంటున్నారు. ఇది గమనించిన సుందరయ్య నగర్‌ లో ఉంటున్న జనసేన పార్టీ కార్యకర్త శ్యాంసన్ ఆమె తో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తమ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ ఒంటరి వృద్ధులకు నెలకు రూ.పది వేల చొప్పున పింఛన్‌ ఇస్తున్నాడని నమ్మించాడు. ఆమెకు జనసేన తరఫున పింఛన్ వచ్చిందని ఓ రోజు కొన్ని డాక్యుమెంట్లతో ఆమె వద్దకు వచ్చాడు. కొన్ని సంతకాలు చేయించుకున్నాడు. ఇది జరిగిన ఆరు నెలల తర్వాత ఆ ఇల్లు తనదేనంటూ బేరం పెట్టాడు. దీంతో వృద్ధురాలు లక్ష్మీ షాక్ కు గురయ్యింది. ఈ విషయమై నున్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్యాంసన్ ను అదుపు లోకి తీసుకున్నారని సమాచారం.