Begin typing your search above and press return to search.

మినరల్ వాటర్ కంటే చమురే చౌక!

By:  Tupaki Desk   |   12 Jan 2016 8:59 AM GMT
మినరల్ వాటర్ కంటే చమురే చౌక!
X
కొద్దికాలం కింద‌టి వ‌ర‌కు చుక్క‌లు చూపించిన చ‌మురు ధ‌ర ఇపుడు నేలబాట ప‌ట్టింది. ఎన్న‌డూ లేనంత త‌క్కువ ధ‌ర‌కు అమ్ముడుపోతోంది. తాజా ధ‌ర‌ల ప్ర‌కారం చూస్తే లీట‌రు చ‌మురు ధ‌ర కంటే మిన‌ర‌ల్ వాట‌ర్ లీట‌రు బాటిల్ ధ‌ర ఎక్కువ కావ‌డం ఆస‌క్తిక‌రం. అయితే ఈ ధ‌ర మాత్రం మ‌న‌కు అందుబాటులోకి రావ‌డం లేదు.

తాజా గ‌ణాంకాల ప్ర‌కారం ఇండియాలోకి దిగుమతయ్యే క్రూడ్(ముడి చ‌మురు) ధర పీపాకు 29.24 డాలర్లుగా నమోదైంది. ఈనెల 7న 66.91గా ఉన్న డాలర్-రూపాయి మారకం రేటు ప్రకారం చూస్తే.. మన కరెన్సీలో ఈ విలువ 1,956.45 రూపాయలు. ఒక పీపాలో 159 లీటర్ల చమురు ఉంటుంది. అంటే ఒక లీటరు చమురు రూ.12కే లభిస్తుందన్నమాట. అదే మన మార్కెట్లో విక్రయించే మినరల్ వాటర్ బాటిల్ ధర దాదాపు రూ.15 స్థాయిలో ఉంది. అంటే మినరల్ వాటర్ కంటే క్రూడాయిలే 20 శాతం చౌక.

చమురు ధరల తగ్గుదల పరిణామంతో దేశీయంగా వాహనదారులకు కలిగిన ప్రయోజనం చాలా స్వల్పం కావ‌డం ఆస‌క్తిక‌రం. జూన్ 2014 నాటి స్థాయితో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 70 శాతం మేర క్షీణించాయి. కానీ బంకుల్లో విక్రయించే ఇంధనం రేటు మాత్రం కేవ‌లం 20 శాతమే తగ్గింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఎక్సైజ్ సుంకం పెంచడంతో వాహనదారులకు పూర్తి ప్రయోజనం దక్కకుండా పోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సర్కారు ఇప్పటివరకు లీటర్ పెట్రోల్‌పై రూ. 7.73, డీజిల్‌ పై రూ. 7.83 మేర‌ ఎక్సైజ్ సుంకం పెంచింది. అంతక్రితం కూడా (నవంబర్ 2014 నుంచి జనవరి 2015 మధ్యకాలంలో) ఎక్సైజ్ డ్యూటీని నాలుగు సార్లు పెంచింది. కేంద్రం సుంకం పెంచకపోయి ఉంటే బంకుల్లో పెట్రోల్ ధర రూ.10, డీజిల్ ఇంకో రూ.9.97 తక్కువకు లభించేది.

ఈ ధ‌ర‌ల‌ను చూస్తుంటే దేవుడు వ‌ర‌మిచ్చినా...పూజ‌రి క‌రుణించ‌ని రీతిలో ప‌రిస్థితులు ఉన్నాయ‌ని వాహ‌న‌దారులు వాపోతున్నారు. హైద‌రాబాద్‌ లో ప్ర‌స్తుతం పెట్రోల్ ధ‌ర లీట‌ర్‌ కు రూ.64.21 పైస‌లు ఉండ‌గా.. డీజిల్ లీట‌ర్‌ కు రూ.49.11 ఉంది.