Begin typing your search above and press return to search.

ఓసీలు పిడికిలి బిగిస్తున్నారు..?

By:  Tupaki Desk   |   13 April 2022 6:59 AM GMT
ఓసీలు పిడికిలి బిగిస్తున్నారు..?
X
ఓసీలు. అగ్ర వర్ణ కులస్థులు. సమాజంలో ఉన్నత వర్గాలు, బహు సంపన్నులు. వారికి ఎవరూ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వారు కేవలం జనాభాలో ఒక అంకెగా మాత్రమే కనిపించే బాపతు. పాలకుల మదిలో ఇవే ఆలోచనలు ఓసీల మీద ఉంటాయనుకుంటే తప్పు మాత్రం లేదు. ఓసీలు అన్న ట్యాగ్ ఒకనాడు ఎలా ఉందో తెలియదు కానీ ఈ రోజున మాత్రం అది పరువు కాదు నెత్తిన బరువు గా మారుతోంది అని నొచ్చుకునే పరిస్థితి ఉంది.

ఓసీల కధ ఎంతదాకా వచ్చిందంటే కష్టపడి రెండు లక్షల మంది జనాలను మెప్పించి చట్ట సభలో సభ్యుడు అయినా అధినాయకత్వాన్ని మెప్పించలేక మంత్రి కూడా కాలేని దుస్థితి. ఏపీలో తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో చూస్తే ఓసీలు రాజకీయంగా ఏమీ కారు. వారి ప్రమేయం అసలు పొలిటికల్ వార్ లో లేనే లేదు, ఉండదు అనిపించేశారు.

ఓసీలు నిన్నటిదాకా కరివేపాకులు అయినా అయ్యారు. ఇపుడు మాత్రం ఏదీ కానే కాదు అని నిరూపించారు. నిజంగా ఓసీలకు సత్తువ లేదా. నంబర్ గేమ్ లో వారి పాత్ర లేదా. ఎంతకాదన్నా వారికి కూడా ఓట్లు ఉన్నాయి కదా అంటే ఇక్కడే సీరియస్ గా అంతా ఆలోచిస్తున్నారు. ఇప్పటిదాకా రాజకీయాల్లో ఓసీల ఐక్యత కానీ వారి రాజకీయ ఆసక్తులు కానీ పెద్దగా బయటకు రాని విషయాలు.

వారు కూడా ఈ రాజకీయాల్లో తమకు పరిమితులు చాలా ఉన్నాయనుకుని గమ్మున ఉండిపోయారు. కానీ ఇపుడు చూస్తే తాము సమ్ థింగ్ కూడా కాదు నథింగ్ అని ఏలికలు గట్టిగా చాటుతూంటే తమనే కార్నర్ చేస్తూంటే వారిలో కూడా పౌరుషం రాదా. నిజానికి ఈసరికే రావాలి కదా.

ఇక ఏపీలో చూసుకుంటే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, పెద్ద సంఖ్యలో లేకపోయినా ఉన్నంతగా ప్రభావితమైన స్థాయిలోనే ఉన్నారు. వారి చేతుల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయన్నది ఇక్కడ లెక్క కాదు కానీ వారు సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఈ రోజుకీ ఉన్నారు కాబట్టి వారు తలచుకుంటే ప్రజాభిప్రాయాన్ని ఎంతో కొంత మార్చగలరు.

ఇక ఇపుడిపుడే ఓసీలు కూడా ఏకీకృతం అవుతున్నారు. చాలా కాలం క్రితం దీని మీద ఒక పరిశీలన జరిగింది. బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా ఐవైఆర్ క్రిష్ణారావు ఉన్నపుడు బ్రాహ్మణుల ఐక్యత కోసం ఆయన పనిచేశారు. ఆ తరువాత విశాల ప్రాతిపదికన క్షత్రియులు, వైశ్యులు కూడా ఒక శక్తిగా ఏర్పాటు కావాలని నాడు ఆయనతో పాటు చాలా మంది పెద్దలు భావించారు.

అంటే ఒక విధంగా ఓసీ ఫ్రంట్ అన్న మాట. ఇపుడు అలాంటి ఆలోచనలు మళ్ళీ ఏపీలో పుట్టుకువస్తున్నాయిట. తమకు మంత్రివర్గంలో సముచిత స్థానం లేకపోవడంతో వారంతా హర్ట్ అయ్యారు. ఒక విధంగా ఇదంతా మంచికే జరిగింది అని కూడా అనుకుంటున్నారుట. వచ్చే ఎన్నికల్లో ఓసీ ఓట్ల సత్తా చాటాలని కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరి ఆ దిశగా కనుక కార్యాచ‌రణ సిద్ధమైతే ఏ ఓసీ ఓట్లు తమకు ఏమీ కావు అని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయో అపుడు వారికే ఇబ్బందిగా మారుతుంది అని చెప్పవచ్చు.

చుక్కా చుక్కా కలిస్తే నదీ ప్రవాహం అవుతుంది అంటారు. అలా అంతా ఒక్కటిగా చేరితే ఏపీలో ఓసీల ఓట్ల శాతం కచ్చితంగా ఆరు నుంచి ఎనిమిదిగా ఉంటుంది. వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. దాంతో ఇంత పెద్ద శాతం ఓటింగ్ అపుడు ఎవరికి అనుకూలంగా మారితే వారిదే విజయం అని కూడా భావించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా వేరే వర్గాలు అధికారంలో తమకు కూర్చోబెట్టాయి రాజకీయ పార్టీలు భావించవచ్చు. 2024 లో ఓసీలు కూడా సత్తా చాటితే వారే రేపటి రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. చూడాలి మరి.