Begin typing your search above and press return to search.

ఊపందుకొంటున్న ఆంధ్ర- తమిళ వైషమ్యాలు!

By:  Tupaki Desk   |   8 April 2015 7:24 AM GMT
ఊపందుకొంటున్న ఆంధ్ర- తమిళ వైషమ్యాలు!
X
శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లర్ల ముఠా ఎన్‌కౌంటర్‌ వ్యవహారం ఆంధ్ర ప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల మధ్య కొత్త రచ్చ గా మారుతోంది. చనిపోయింది తమిళనాడుకు చెందిన వారు అని తేలిన వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు. వెంటనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు లేఖ రాశాడు. తమ నిరసన తెలిపాడు!

ఎన్‌కౌంటర్‌ అనేది ఖండించదగిన చర్యనే. అయినా స్మగ్లింగ్‌ అనేది దోపిడి. అది ఎవరు చేసినా ఖండించాల్సిందే. ఇక ఎర్రచందనం స్మగ్లర్లు వెనుకటికి పోలీసులపై దాడులు చేసిన చరిత్ర కూడా ఉంది. అయినా కూడా తమిళనాడు ప్రభుత్వం వారిని వెనకేసుకు వస్తోంది.

ఇక ఆ తర్వాత తమిళనాడులో ఏపీ బస్సులపై దాడులు జరిగాయి. చెన్నైలో చంద్రబాబు బొమ్మలను దహనం చేశారు. ఈ పరిణామాన్ని గమనించి సరిహద్దు ప్రాంతాల నుంచి చెన్నై వెళ్లే బస్సులను ఏపీఎస్‌ ఆర్టీసీ ఆపివేసింది!

ఏపీలోని ముఖ్యప్రాంతాల నుంచి చెన్నై వెళ్లే కొన్ని వందల బస్సులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకొన్నారు.

మరి ఇంతటితో ఈ రచ్చలు చల్లారతాయి అనుకొంటే.. ఇవి మరింత పుంజుకొనేలా కనిపిస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో తమిళం మాట్లాడే యువకులపై దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. తమిళనాడులో ఏపీ బస్సులపై జరిగిన దాడులకు ప్రతిగానే తమిళయువకులపై దాడులు జరిగాయని భావిస్తున్నారు.

మరి ఇలాంటి పరిణామాలు ఏమాత్రం సమర్థనీయమైనవి కావు. దాడులు చేస్తున్నది ఎవరైనా.. వాటిని ఖండించాలి. ప్రాంతీయ వైషమ్యాలతో ఇలా కొట్టుకోవడం జాతికే మంచిది కాదు.