Begin typing your search above and press return to search.

మోడీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసిన నుపుర్ శర్మ ఎవరు?

By:  Tupaki Desk   |   7 Jun 2022 3:22 AM GMT
మోడీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసిన నుపుర్ శర్మ ఎవరు?
X
అందుకే అంటారు బయటోళ్లు దెబ్బేస్తే కాచుకోవచ్చు. ధీటుగా రియాక్టు కావొచ్చు. కానీ.. ఇంట్లో వారే దెబ్బేస్తే.. విలవిలాడిపోవటం ఖాయం. ఆ షాక్ నుంచి తేరుకోవటమే కష్టం అవుతుంది. అది సామాన్యుడికైనా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకైనా ఒక్కటే అన్న విషయం తాజా పరిణామాల్నిచూసినప్పుడు ఇట్టే అర్థమవుతుంది.

బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ..ఒక చానల్ లో మాట్లాడే క్రమంలో.. మహ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ సీనియర్ నేత నుపుర్ శర్మ ప్రకంపనలు ఇంకా బీజేపీని వదల్లేదు. ఆ మాటకు వస్తే.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని ఇబ్బందుల్ని మోడీ సర్కారు ఎదుర్కొంటోంది. నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన ఆమె మాటలపై వెల్లువెత్తిన విమర్శలు.. ఆగ్రహావేశాలకు తలవంచిన నరేంద్ర మోడీ.. తమ పార్టీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దేశ వ్యాప్తంగా చర్చను రేపటమే కాదు.. విదేశాల్లోనూ మోడీ సర్కారుకు కొత్త సవాళ్లను ఎదుర్కొనేలా చేసిన నుపుర్ శర్మ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నదిప్పుడు అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆమె విషయానికి వస్తే.. రైట్ భావాలు ఎక్కువగా ఆమె మాటల్లో కనిపిస్తాయి. హిందుత్వ ఎజెండా రాజకీయాల్ని నెరపటంలో ఆమెకు మంచి పట్టు ఉంది.

ఉన్నత చదువులు చదివిన ఆమె.. 2008లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఏబీవీపీ (బీజేపీ అనుబంధ సంస్థ) తరఫున ఎన్నికయ్యారు. ఢిల్లీ వర్సిటీ నుంచి ఆమె ఎల్ఎల్ బీ పట్టా పొందారు. దీనికి ముందు ఢిల్లీవర్సిటీ పరిధిలోని హిందూ కాలేజీలో ఎకనామిక్స్ డిగ్రీ చేశారు. తర్వాత న్యాయశాస్త్రానికి షిఫ్టు అయ్యారు. బీజేపీలోచేరిన ఆమె చాలా త్వరగానే పార్టీలో ఎదిగారు. బీజేపీ మహిళా నేతగా ఆమెకు చాలా త్వరగానే మంచి పేరు ప్రఖ్యాతులు సొంతమయ్యాయి. గుర్తింపు లభించింది.

బీజేవైఎం జాతీయకార్యవర్గ సభ్యురాలిగా సుపరిచితమైన ఆమె.. జాతీయ మీడియా కో ఇన్ చార్జిగా వ్యవహరించేవారు. ఢిల్లీ బీజేపీ శాఖ కార్యవర్గ సభ్యురాలిగా పని చేశారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ అధినేత.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

తాజాగా మహ్మద్ ప్రవక్త మీద ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు షాకింగ్ గా మారటమే కాదు.. బీజేపీ సైతం ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితి. దీంతో.. దాన్ని ఎలా సర్ది చెప్పాలో అర్థం కాక కిందా మీదా పడుతున్న కమలనాథులు.. వెంటనే ఆమెపై వేటు వేశారు. అయినప్పటికీ ఆమె వ్యాఖ్యలపై మొదలైన రగడ మాత్రం ఒక కొలిక్కి ఇంకా రాలేదు.