Begin typing your search above and press return to search.

నూపుర్ ఎఫెక్ట్.. భార‌త్‌కు అమెరికా సూక్తి ముక్తావ‌ళి!

By:  Tupaki Desk   |   17 Jun 2022 1:30 PM GMT
నూపుర్ ఎఫెక్ట్.. భార‌త్‌కు అమెరికా సూక్తి ముక్తావ‌ళి!
X
మహ్మద్ ప్రవక్తపై రాజకీయ నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారాయి. తాజాగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు అమెరికా తెలిపింది. మానవ హక్కులపై గౌరవాన్ని పెంపొందించుకోవాలని భారత్ను ప్రోత్సహిస్తున్నట్లు అమెరికా.. సూక్తి ముక్తావ‌ళి వ‌ల్లించింది.

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతలు నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ చెసిన అనుచిత వ్యాఖ్యలు.. అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారాయి. భారత్‌తో సన్నిహిత సంబంధాలు నెరిపే పలు ఇస్లామిక్ దేశాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. ఈ వివాదంపై తాజాగా అమెరికా స్పందించింది. మత స్వేచ్ఛతో పాటు మానవ హక్కుల ఆందోళనలపై భారత్తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తామని తెలిపింది.

"బీజేపీకి చెందిన ఇద్దరు నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం. అదే సమయంలో ఈ వ్యాఖ్యలను పార్టీ బహిరంగంగా ఖండించడాన్ని గమనించాం. మత స్వేచ్ఛతో సహా మానవహక్కుల ఆందోళనలపై భారత ప్రభుత్వంలోని సీనియర్ స్థాయి వ్యక్తులతో నిత్యం సంప్రదింపులు జరుపుతుంటాం. మానవ హక్కులపై గౌరవాన్ని పెంపొందించుకోవాలని భారత్‌ను ప్రోత్సహిస్తున్నాం" అని అమెరికా పేర్కొంది.

నూపుర్ శర్మ ఒక టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా.. బీజేపీ ఆమెను సస్పెండ్ చేసింది. ఇదే విషయంలో మరో నేత నవీన్ జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాలు నిరసన తెలిపాయి. అయితే తమకు అన్ని మతాలూ సమానమేనని, ఎవరినీ అవమానించడం లేదని భారత్‌ స్పష్టం చేసింది.

ముందు మీరు నేర్చుకోండి!ఇదిలావుంటే.. నిత్యం ఎక్క‌డో ఒక చోట న‌ల్ల‌జాతీయుల‌పై.. విరుచుకుప‌డే అమెరికా పోలీసులు.. ప్ర‌పంచ వ్యాప్తంగా మాన‌వ హ‌క్కుల‌ను తొక్కిపెడుతున్నార‌నే విమ‌ర్శ‌లు వున్నాయి. అఫ్గాన్‌పై యుద్దం స‌మ‌యం లోనూ.. అక్క‌డి సైనికుల‌ను ఇష్టానుసారం కొట్టి హింసించారు.

ఇక‌, ఇటీవ‌లే న‌ల్ల‌జాతీయుణ్ని.. పోలీసులు కాల్చి చంపారు. మ‌రి ఇన్ని రూపాల్లో మాన‌వ హ‌క్కుల హ‌న‌నానికి పాల్ప‌డుతున్న అగ్ర‌రాజ్యం.. ఇప్పుడు.. భార‌త్‌కు సూక్తులు బోధించ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. "ముందు మీరు నేర్చుకోండి" అంటూ.. మేధావులు సూచిస్తున్నారు.