Begin typing your search above and press return to search.

తిరుపతిలో టెంక్షన్..236 మంది కరోనా బాధితులు మిస్సింగ్!

By:  Tupaki Desk   |   23 July 2020 8:10 AM GMT
తిరుపతిలో టెంక్షన్..236 మంది కరోనా బాధితులు మిస్సింగ్!
X
ఏపీలో గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా గత మూడు రోజులుగా రోజుకి ఐదు వేలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న ఒకేసారి 6 వేలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే, రాష్ట్రంలో భారీగా టెస్టులు నిర్వహించడం వల్లే భారీగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే ..తాజాగా తిరుపతి లో మరో విచిత్ర పరిస్థితి నెలకొంది.

కరోనా నిర్దారణ టెస్ట్‌ లో పాజిటివ్ వచ్చిన బాధితులు - పాజిటివ్ వచ్చిన తరువాత చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరడం లేదు. కరోనా నిర్దారణ టెస్ట్ కోసం శాంపిల్స్‌ తీసుకునే సమయంలో కొంతమంది రాంగ్ ఫోన్ నంబర్ - తప్పుడు అడ్రస్ ‌ని ఇస్తున్నారు. టెస్టుల్లో పాజిటివ్ వచ్చాక వారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లేదా రాంగ్ నంబర్ అని వస్తోంది. ఇక చిరునామాకు వెళ్తే అది వారి అడ్రస్ కాదని వెల్లడౌతోంది. ఇలా గత పదిరోజుల్లో తిరుపతిలో 236మంది కరోనా పాజిటివ్ బాధితుల ఆచూకీ దొరకలేదు. దీంతో వారిని ఎలా పట్టుకోవాలి అని అధికారులకి అర్థం కావడంలేదు. పాజిటివ్ వచ్చినప్పటికీ వారు జనాల్లోనే తిరుగుతున్నట్టుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీరిపై అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై జిల్లా కలెక్టర్ భత్‌ నారాయణ గుప్తా మాట్లాడుతూ.. రోజుకి కనీసం 20 పాజిటివ్ కేసుల విషయంలో ఇలాగే జరుగుతోందని అన్నారు. పాజిటివ్ కేసుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని, టెస్ట్ చేయించుకుని రాంగ్ ఫోన్ నంబర్, తప్పుడు అడ్రస్ ఇస్తే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనితో ఇకపై టెస్ట్ కోసం శాంపిల్ తీసుకునేప్పుడు ఓటీపీ సిస్టమ్ పెడుతున్నట్టు ప్రకటించారు.