Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: తెలంగాణలో కరోనాను జయించిన బాధితుడు

By:  Tupaki Desk   |   11 March 2020 4:49 AM GMT
బ్రేకింగ్: తెలంగాణలో కరోనాను జయించిన బాధితుడు
X
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు తెలంగాణలో చెక్ పడింది. దుబాయ్ లో కరోనాను అంటించుకొని బెంగళూరు ద్వారా హైదరాబాద్ వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కరోనాను జయించాడు. హైదరాబాద్ గాంధీలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి ఇతడికి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఇతడు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తాజాగా ప్రకటించారు.

గాంధీ హాస్పిటల్ లో తాజాగా జరిపిన వైరాలజీ టెస్ట్ లో బాధితుడి షాంపిల్స్ లో కరోనా నెగెటివ్ గా తేలింది. దీంతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారిని తెలంగాణలో తరిమికొట్టినట్టైంది.

ఇక 48 గంటల తర్వాత మరోసారి కరోనా బాధితుడి రక్తనమూనాలను ఫుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపనున్నారు. అక్కడ కూడా నెగెటివ్ అని తేలితే వైరస్ బారి నుంచి బాధితుడికి విముక్తి కలిగినట్టే..

సికింద్రాబాద్ లోని మహేంద్రహిల్స్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ (24) కంపెనీ పనిమీద దుబాయ్ వెళ్లాడు. అక్కడ చైనా హాంకాంగ్ కు చెందిన తోటి సాఫ్ట్ వేర్ ఇంజినీర్లతో కలిసి పనిచేశాడు. ఫిబ్రవరి 20న బెంగళూరు వచ్చాడు. 22న బస్సులో హైదరాబాద్ వచ్చాడు. అయితే వైరస్ సోకిన లక్షణాలు, జ్వరం రావడంతో మొదట ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించుకున్నాడు. తగ్గకపోవడంతో సికింద్రాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రి లో చేరాడు. ఎంతకీ జ్వరం తగ్గకపోవడం.. కరోనా లక్షణాలు ఉండడం తో అనుమానం వచ్చిన ప్రైవేటు వైద్యులు గాంధీ ఆస్పత్రికి పంపారు. వారు రక్తనమూనాలు సేకరించి పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్ కు పంపారు. అక్కడ పరీక్షల్లో కరోనా వైరస్ అని తేలింది. కేంద్రం అధికారికంగా ఈ విషయాన్ని తెలిపింది.

దీంతో అప్పటి నుంచి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డు లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం వైరస్ ను జయించి పూర్తిగా కోలుకున్నాడు.