Begin typing your search above and press return to search.

అమెరికాను కొత్త‌గా వ‌ణికిస్తున్న ఉత్త‌ర‌కొరియా

By:  Tupaki Desk   |   6 May 2017 5:01 PM GMT
అమెరికాను కొత్త‌గా వ‌ణికిస్తున్న ఉత్త‌ర‌కొరియా
X
అమెరికాను వణికించ‌డంలో ముందంజ‌లో ఉండే ఉత్త‌ర‌కొరియా తాజాగా మ‌రో షాక్ ఇచ్చింది. ఇటీవ‌లే అమెరికా హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆ మధ్యన ఓ భారీ క్షిపణి పరీక్షను నిర్వహించ‌డం, అది వైఫ‌ల్యం చెందిన ఘ‌ట‌న గుర్తుండే ఉంటుంది. ఇది కొరియా వైఫ‌ల్యం అని ప‌లువురు భావించారు. అయితే దీనివెనుక అమెరికాను వ‌ణికించే స్కెచ్ ఉంద‌ని తేలింది.

ఉత్తరకొరియా ఆనాడు ప్రయోగించిన క్షిపణి భూ ఉపరితలం నుంచి 71 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత పేలిపోయిందన‌డంలో వాస్త‌వం లేద‌ని, ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాల ప్రకారం కావాలని గగనతలంలోనే పేల్చివేశారనే అమెరికా ఇంటలిజెన్స్ సంస్థ సీఐఏ మాజీ చీఫ్ జేమ్స్ వూస్లీ విశ్లేషించారు. క్షిపణి ప్రయోగం విఫలం కాలేదని, దాని వెనుక పక్కా ప్రణాళిక కూడా ఉందని ఆయ‌న తెలిపారు. అమెరికాను కొత్త‌గా ఇబ్బంది పెట్టే క్ర‌మంలో ఈ ఎత్తుగ‌డ వేసిన‌ట్లు చెప్పారు. అత్యంత ఎత్తులో జరిగే ఈ న్యూక్లియర్ విస్ఫోటనం వల్ల వెలువడే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ వల్ల భూమ్మీద ఉన్న పవర్ గ్రిడ్ లు ఎందుకూ పనికిరాకుండా పోతాయట. ఫలితంగా...విద్యుత్తుతో అనుసంధానమైన అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోతాయి. త‌ద్వారా తినటానికి తిండి, తాగటానికి నీరు కూడా లభించవని జేమ్స్ వూస్లీ తెలిపారు. అంటే లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ఆయ‌న విశ్లేషించారు. బ్యాంకింగ్ - టెలీకమ్యూనికేషన్స్ - మెడిసిన్ - ఇలా అన్ని వ్యవస్థలు స్తంభించిపోతాయని వివ‌రించారు.

కాగా తాజా ప‌రిణామంపై అమెరికా అంచ‌నాలు భిన్నంగా ఉన్నాయి. భూమి మీద ఉన్న లక్ష్యాలపై నేరుగా దాడి చేయకుండా... అంతకన్నా ఎక్కువ వినాశనానికి కారణమయ్యే దిశగా కిమ్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోందని అంటున్నారు. ఈ చ‌ర్య‌పై త‌మ అధ్య‌క్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాల‌ని అంటున్నారు. కాగా, గతంలో అమెరికా సైతం ఇలాంటి ప్ర‌క్రియ నిర్వ‌హించ‌డం ఆస‌క్తిక‌రం. పసిఫిక్ మహా సముద్రంలో ఇలాంటి హై-ఆల్టిట్యూడ్ టెస్టును అమెరికాయే నిర్వహించింగా... దాని దెబ్బకు హవాయిలో విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/