Begin typing your search above and press return to search.

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఆ మంత్రులు ఓటేసే చాన్సే లేదు

By:  Tupaki Desk   |   6 July 2017 5:27 AM GMT
రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఆ మంత్రులు ఓటేసే చాన్సే లేదు
X
ఎన్టీయే రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రామ్ నాథ్ కోవింద్ కు మ‌ద్ద‌తుగా మిత్ర ప‌క్షాలు, భావ‌సారూప్య పార్టీలు నిలుస్తున్నాయి. అయితే... కేంద్ర‌లోని ఎన్టీయే ప్ర‌భుత్వంలో భాగ‌స్వామి అయిన తెలుగుదేశం ఆధ్వ‌ర్యంలో ఏపీలో ఉన్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఉన్న న‌లుగురు మంత్రులు ఈ ఎన్నిక‌ల్లో ఓటేయ‌డం లేదు. వారికి ఆ చాన్సే లేదు. అందుక్కారణం వారు ఎమ్మెల్సీలు కావడమే.

రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్‌ ఉభయసభలకు చెందిన సభ్యులకు ఓటు హక్కు ఉండగా రాష్ట్రాల దగ్గరకొచ్చేసరికి కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలకు ఓటు హక్కు లేదు. చంద్రబాబు మంత్రిమండలిలోని యనమల రామకృష్ణుడు - నారాయణ - సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి - నారా లోకేష్‌ ఎమ్మెల్సీలు అయినందున వారికి ఓటు వేసే అవకాశం లేకుండా పోయింది. మామూలుగా అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీలకు ఓటు ఉండదని సరిపెట్టుకోవచ్చు. కానీ ఓటు హక్కు లేని నలుగురు కేబినెట్‌ మంత్రులూ ఆషామాషీ వ్యక్తులు కారు. చంద్రబాబు ప్రభుత్వంలో, కేబినెట్‌ లో వారికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అలాంటిది మంత్రులుగా ఉండి ఉండి కూడా దేశ ప్రథ‌మ పౌరుడిని ఎన్నుకునే క్రమంలో ఓటు లేకపోవడంపై టిడిపిలో చర్చనీయాంశంగా మారింది.

ఏ పదవీ లేని సాదాసీదా ఎమ్మెల్యేలకు ఓటు హక్కు కలిగి ఉండగా, పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే తమకు ఓటు లేకపోవడం పట్ల ఆ నలుగురూ ఇబ్బందిగా భావిస్తున్నారని టిడిపి నేతలే చెబుతున్నారు. మ‌రోవైపు తెలంగాణాలోనూ ఇలాంటి ప‌రిస్థితే ఉంది. అక్క‌డ ఏకంగా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు - హోం శాఖ మంత్రి మొత్తం ముగ్గురికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేదు. కెసిఆర్‌ కేబినెట్‌ లో ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ - కడియం శ్రీహరి - హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎమ్మెల్సీలు కావడంతో వారికి ఓటు వేసే అవకాశం లేదు. ఆ ముగ్గురు కూడా అక్క‌డ కీల‌క‌మే. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కీల‌క మంత్రులెవ‌రికీ రాష్ట్రప‌తిని ఎన్నుకునే అవ‌కాశం లేక‌పోవ‌డం విచిత్ర‌మే మ‌రి.