Begin typing your search above and press return to search.

40 మంది టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టికెట్?

By:  Tupaki Desk   |   8 Jun 2022 5:50 AM GMT
40 మంది టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టికెట్?
X
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎనిమిదేళ్లుగా తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఎదిగిన కేసీఆర్ కు దుబ్బాక ఉప ఎన్నిక నుంచి వ్యతిరేక పవనాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవడంతో అక్కడ ఓడిపోయామని భావించినా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బ కొట్టింది. అయితే ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ హవా సాగింది.

అయితే అక్టోబర్లో జరిగిన హుజూరాబాద్ ఎన్నికతో మాత్రం రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఏ ఎన్నికకు తేలిగ్గా తీసుకోకూడదని భావించిన గులాబీ దళపతి అక్కడ దళితబంధు పేరిట కోట్లు కుమ్మరించారు. ఒక్కో ఓటుకు ఆ ఎన్నికల్లో రూ.6వేల వరకూ పంచారని సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. అయినా కూడా బీజేపీని హుజూరాబాద్ లో ఓడించలేకపోయారు. అప్పటినుంచి బీజేపీతో కేసీఆర్ కాస్త గట్టిగా పోరాడుతున్నాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కూడా పుంజుకోవడంతో కేసీఆర్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు కష్టమేనని సర్వేల్లోతేలిందట.. కనీసం 40 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కుతాయని ఓ అంతర్గత సర్వేలో తేలిందట.. టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్న దేశంలోనే పాపులర్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సర్వేల నివేదిక ఒకటి బయటపడింది. ఈ సర్వే ఏజెన్సీలు చాలా మంది మొదటి, రెండో టర్మ్ గెలిచిన ఎమ్మెల్యేలు చాలా పేలవంగా రాణించారని, వారిని సరిగ్గా సెట్ చేయడానికి వారికి టీఆర్ఎస్ కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని సూచించాయట..

2021 డిసెంబర్, జనవరిలో నిర్వహించిన సర్వేల్లో బీజేపీ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీదారు ఇప్పుడు బీజేపీయేనని తేలింది. కాంగ్రెస్ ను తేలికగా తీసుకోవద్దని సూచించిందట. తన పనితీరును మెరుగుపరుచుకున్న బీజేపీ ఇప్పుడు మెజార్టీ సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.

రెండు సార్లు గెలవడం.. మూడో సారి తీవ్ర వ్యతిరేకత ఉండడంతో టీఆర్ఎస్ ఈసారి దేశంలోనే పెద్ద రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ తో రెండేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. పీకే ఎన్నికల వ్యూహం.. రాజకీయ బ్రాండింగ్ ఖచ్చితంగా టీఆర్ఎస్ కి సహాయం చేస్తుందని పార్టీ భావిస్తోంది. టీఆర్ఎస్ తన ఐటీ సెల్, డిజిటల్ టీమ్‌లను కూడా పెంచుకుంటోంది. పార్టీ డిజిటల్ ప్రచారాల కోసం పెద్ద సంఖ్యలో బృందాలను నియమించారు.

ఇక తాను ఒంటిరి వ్యూహంతో కాకుండా పీకే సాయంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుండడంతో కేసీఆర్ కేంద్రంతో తగాదా పెట్టుకుంటున్నాడు. కేంద్రం, రాష్ట్రం బీజేపీలపై రకరకాల ఆరోపణలు చేస్తూ వార్తలో నిలుస్తున్నారు. అయితే వివిధ సర్వేల ద్వారా తనకు వ్యతిరేకత ప్రారంభమైందన్న రిపోర్టు తెలుసుకోవడంతో ఇక పీకే టీం ద్వారా అసలు జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

రాబోయే ఎన్నికల కోసం కేసీఆర్ ఇప్పటినుంచే రెడీ అవుతున్నట్టు తెలిసింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థ 70 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై తొలి నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం వచ్చే ఎన్నికల్లో 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవచ్చని ప్రచారం సాగుతోంది. నాయకుల బలం, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చరుకుగా ఉన్నారా? అనే అంశాలను ఐప్యాక్ ఆరాతీసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే 40 మందికి టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వదన్న ప్రచారం ఇప్పుడు గులాబీ నేతల్లో గుబులు రేపుతోంది.

ఈ క్రమంలోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా కోవర్టు రాజకీయాలను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిని ఇలాగే వాడుకొని బయటపడడంతో టీఆర్ఎస్ ఇరుకునపడింది. బూత్, గ్రామ, మండల స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల నుంచి కూడా పార్టీలోకి ఎర వేయగల నేతలను టీఆర్‌ఎస్ గుర్తిస్తోందని చెబుతున్నారు. అయితే ఇది ఎన్నికల సమయంలో జరుగుతుందని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. అప్పటి వరకు ఈ నేతలు టీఆర్‌ఎస్‌కు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.