Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ కు ఏకైక ఎమ్మెల్యే ఇచ్చిన అదిరిపోయే షాక్

By:  Tupaki Desk   |   11 Jan 2020 4:10 PM GMT
ప‌వ‌న్‌ కు ఏకైక ఎమ్మెల్యే ఇచ్చిన అదిరిపోయే షాక్
X
జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆ పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోమారు అదిరిపోయే షాకిచ్చారు. ఒకవైపు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్య‌మంత్రి జగన్ సర్కార్ తీరుపై విరుచుకుపడుతుంటే.. రాపాక మాత్రం వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. గ‌తంలో రాపాక వరప్రసాద్‌ జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. దానికి కొన‌సాగింపుగా - కాకినాడలో పవన్ కళ్యాణ్ చేసిన దీక్షకు కూడా వరప్రసాదరావు వెళ్లలేదు. అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో వెళ్లలేదని ఆయనే క్లారిటీ ఇచ్చారు. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్వ‌హించిన పార్టీ విస్తృత స‌మావేశానికి డుమ్మాకొట్టారు. కీలక సమావేశానికి హాజరుకాకుండా ఎడ్ల పందాలకు వెళ్లిన ఆయ‌న ఏకంగా వైసీపీ మంత్రితో క‌లిసి స‌మావేశంలో పాల్గొని ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఉంటానని ప్ర‌క‌టించారు.

మంగ‌ళ‌గిరిలో జ‌రుగుతున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి డుమ్మా కొట్టిన జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక‌ - వైసీపీ సీనియ‌ర్ నేత‌ మంత్రి కొడాలి నానితో కలిసి ఎడ్ల పందేల పోటీల్లో పాల్గొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో ఎన్టీఆర్‌ టు వైఎస్సార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలను మంత్రి కొడాలి నానితో కలిసి ఎమ్మెల్యే రాపాక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎడ్ల పందేలంటే ఇష్టంతోనే గుడివాడ వచ్చానని తెలిపారు. త‌న‌ను ఈ పందేలకు ఆహ్వానించిన మంత్రి కొడాలి నాని కి ధన్యవాదాలు అని తెలిపారు.

ఇక పార్టీలోని ప‌రిణామాల గురించి జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. త‌న‌ పార్టీ మాట తాను వినే పరిస్థితుల్లో లేనంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జనసేనలో చెప్పడం అడగడం ఏమీ ఉండవన్నారు. పార్టీలో తన అభిప్రాయం సొంతంగా ఉంటుందని అన్నారు. జగన్ 3 రాజధానుల విధానం సరైందేనని రాజధాని ప్రజలు రోడ్లపై ధ‌ర్నాలు చేసే బ‌దులుగా సీఎంను కలిస్తే ప్రతిఫలం ఉంటుందని సూచించారు.కాగా, రాపాక తీరు స‌హ‌జంగానే తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.