Begin typing your search above and press return to search.

ఆ అధికార పార్టీ నేతను ఏం చేయాలి?

By:  Tupaki Desk   |   10 Aug 2016 6:06 PM GMT
ఆ అధికార పార్టీ నేతను ఏం చేయాలి?
X
చిన్న చిన్న సంఘటనల్ని భూతద్దంలోచూపిస్తూ.. దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించే రాజకీయశక్తులకు కొదవ లేదు. కానీ.. ఒక అధికారపార్టీకి చెందిన నేత ఒకరు ఇష్టారాజ్యంగా చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందించాలన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పాలి. ఏ మాత్రం బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేయటమే కాదు.. సమాజంలో హింసను పెంచేలా ఉన్న సదరు నేత మాటలు విన్న వారంతా షాక్ తినే పరిస్థితి. దారుణమైన విషయం ఏమిటంటే.. దేశంలో ఎక్కడో ఒక మూల ఒకరిపై జరిగిన ఘటన మీద స్పందించే రాజకీయ నేతలు.. మేధావులు.. సెలబ్రిటీలు.. ఒక రాష్ట్రంలోని అధికారపార్టీకి చెందిన నేత.. ఒక వర్గం మొత్తమ్మీదా విషాన్ని చిమ్ముతూ ఇష్టారాజ్యంగా చేసిన వ్యాఖ్యలు చేసినా ఎలాంటి స్పందన లేకపోవటాన్ని ఏమనాలి? ఎలా అర్థం చేసుకోవాలి.

ఈ దేశంలో ఎవరి మీద ఎవరు విద్వేషం ప్రదర్శించినా ఖండించాల్సిందే. కానీ.. కొందరి విషయంలో స్పందించేంత ఉత్సాహంగా.. మరికొందరిపై ఏ మాత్రం పట్టించుకోనట్లుగా వ్యవహరించటం ధర్మమేనా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అధికారపార్టీ అయిన సమాజ్ వాదీకి చెందిన ఒక నేత మాట్లాడిన మాటలు సెగలు పుట్టిస్తున్నాయి.

తీవ్రమైన విద్వేషంతో చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల్ని చూస్తే.. ‘‘కశ్మీర్ పండిట్లను వెళ్లగొట్టిన విధంగా యూపీ నుంచి బ్రాహ్మణులను వెళ్లగొట్టాలని.. యూపీ కేవలం ముస్లిం.. యాదవుల రాష్ట్రం. యూపీలో బ్రాహ్మణులంతా ప్రధాని మోడీకి చెందిన అహ్మాదాబాద్ కు పోయి బతకాలి. బ్రాహ్మణులు లంచగొండులు. రాష్ట్రం నుంచి వారిని తరిమి కొట్టాలి’’ అంటూ సదరు నేత తెగబడ్డారు. సమాజ్ వాదీకి చెందిన రాజీవ్ కుమార్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు పచ్చిగా ఒక వర్గాన్ని లక్ష్యం చేసుకున్నట్లుగా ఉన్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది. మరి.. ఇంతలా టార్గెట్ చేసిన నేతపై ఎలాంటి చర్యా తీసుకోరా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సదరునేత ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసి రోజు గడుస్తున్నా.. ఏటు వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవటాన్ని ఏమనాలి? ఎలా అర్థం చేసుకోవాలి?