Begin typing your search above and press return to search.

రామాల‌యానికి బాబ‌ర్ వంశీకులు ఓకే!

By:  Tupaki Desk   |   17 Sep 2018 6:20 AM GMT
రామాల‌యానికి బాబ‌ర్ వంశీకులు ఓకే!
X
అయోధ్యలోని వివాదాస్ప‌ద క‌ట్ట‌డంపై మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి బ‌హ‌దూర్ షా జఫ‌ర్ వార‌సుడు యువ‌రాజు యూకుబ్ హ‌బీబుద్దిన్ టూసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. మొఘ‌ల్ చ‌క్ర‌వర్తి బాబ‌ర్ ముని.. ముని మ‌న‌మ‌డైన యూకుబ్ అయోద్య‌లోని వివాదాస్ప‌ద స్థ‌లం బాబ‌ర్ ఆస్తి అని తేలిన ప‌క్షంలో.. అందులో ఆల‌యాన్ని నిర్మించేందుకు త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ఢిల్లీలో ప్ర‌క‌టించారు.

అయోధ్య‌లోని స్థానిక ప్ర‌జ‌ల‌తో క‌లిసి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి.. రామాల‌య నిర్మాణానికి తాను ప్ర‌య‌త్నిస్తాన‌న్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేశారు. రామాల‌యం శంకుస్థాప‌న‌కు తాను కూడా వ‌స్తాన‌ని యూకూబ్ ప్ర‌క‌టించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

వివాదాస్ప‌ద స్థ‌లంలో దేవాల‌య నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం తీర్పు ఉంటే.. అందుకు తాను త‌న పూర్తి మ‌ద్ద‌తు ఇస్తాన‌ని చెప్పారు. ఇదే విష‌యాన్ని తాను హిందూ మ‌హాస‌భ‌కు కూడా లేఖ రాసిన‌ట్లు పేర్కొన్నారు. అయోధ్య‌లోని వివాదాస్ప‌ద స్థ‌లం వ‌క్ఫ్ బోర్డుది కాకుండా బాబ‌ర్ ఆస్తిగా తేలిన ప‌క్షంలో దాని య‌జ‌మానులుగా రాముడి ఆల‌య నిర్మాణానికి త‌న‌కు ఎలాంటి స‌మ‌స్యా లేద‌న్నారు. స‌మాజంలో ప్ర‌తి ఒక్క‌రూ శాంతియుత జీవ‌నాన్ని సాగించాల‌ని తాను కోరుకుంటాన‌ని చెప్పారు. మొత్తంగా మొఘ‌ల్ వంశీకుడి మాట ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.