Begin typing your search above and press return to search.

వేమూరు నియోజకవర్గంలో ఇన్చార్జ్ లేక జనసేన శ్రేణుల ఆందోళన!

By:  Tupaki Desk   |   13 Jun 2022 8:51 AM GMT
వేమూరు నియోజకవర్గంలో ఇన్చార్జ్ లేక జనసేన శ్రేణుల ఆందోళన!
X
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పార్టీకి ఇన్చార్జ్ లేరని జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన వేమూరులో ప్రస్తుతం మేరుగ నాగార్జున ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఇటీవల ఏపీ మంత్రివర్గ విస్తరణలో మేరుగ నాగార్జునకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చాన్సు లభించింది. మరోవైపు 2009, 2014ల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన నక్కా ఆనందబాబు వేమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జుగా ఉన్నారు. 2019లో మేరుగ నాగార్జున చేతిలో నక్కా ఆనందబాబు ఓడిపోయారు. అంతకుముందు అంటే 2014లో గెలిచి చంద్రబాబు ప్రభుత్వంలో నక్కా ఆనందబాబు మంత్రిగా కూడా పనిచేశారు.

మరోవైపు వేమూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కూడా అత్యంత బలంగా ఉంది. ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్ల సంఖ్య 35 వేలుగా ఉంది. అత్యధికంగా ఎస్సీలు 40 వేలు మంది ఉన్నారు.

అయితే వీరిలో మాదిగల జనాభా ఎక్కువ. కానీ తెలుగుదేశం, వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన నక్కా ఆనందబాబు, మేరుగ నాగార్జున ఇద్దరూ మాల సామాజికవర్గానికి చెందినవారు. ఈ నేపథ్యంలో మాదిగ సామాజికవర్గానికి జనసేన సీటు ఇస్తే ఈ నియోజకవర్గాన్ని సులువుగా గెలుచుకోవచ్చని చెబుతున్నారు.

2019లో వేమూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా భరత్ భూషణ్ పోటీ చేశారు. ఈయన ఒక విశ్రాంత అధికారి. ఎన్నికలకు చాలా తక్కువ రోజుల ముందు పార్టీలో చేరిన భరత్ భూషణ్ ఓడిపోయాక మళ్లీ పార్టీ ముఖం చూడలేదు. దీంతో జనసేన పార్టీ నియోజకవర్గంలో చుక్కాని లేని నావలా తయారైంది. అయితే పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ నియోజకవర్గంలో గణనీయమైన ఫలితాలు సాధించింది. అచ్చంగా కాపు సామాజికవర్గానికి చెందిన గ్రామాలు నియోజకవర్గంలో చాలా ఉన్నాయి.

జనసేన పార్టీకి వేమూరులో నియోజకవర్గ ఇన్చార్జు లేనప్పటికీ కార్యకర్తలు, అన్ని సామాజికవర్గాలు, మతాల్లో ఉన్న అభిమానులే పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల్లోనూ కార్యకర్తలే అభ్యర్థులను నిలబెట్టుకుని మంచి ఫలితాలు సాధించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇన్చార్జును వేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. జనసేన నియోజకవర్గ ఇన్చార్జుగా ఈవూరి అనూప్ సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.