Begin typing your search above and press return to search.

అమరావతి ​లో కరెంటు స్తంభాలుండవు!

By:  Tupaki Desk   |   23 July 2015 10:42 PM IST
అమరావతి ​లో కరెంటు స్తంభాలుండవు!
X
కృష్ణా నది తీరంలో ప్రపంచస్థాయిలో అద్భుత రాజధాని నగరం రూపుదిద్దుకోనుంది. ఈ మేరకు సింగపూర్ బృందం తన ప్రణాళికను ఆవిష్కరించింది. ఏడు కిలోమీటర్ల నదీ తీరం మధ్యలోని లింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, తాళ్లాయపాలెంలోని 4235 కిలోమీటర్ల పరిధిలో అమరావతి నిర్మాణం కానుంది. ప్రపంచ రాజధానులను తలదన్నే రీతిలో ఇక్కడ అమరావతి గేట్ వే, డౌన్ టౌన్, అమరావతి వాటర్ ఫ్రంట్ లను నిర్మిస్తారు.

నదీ తీరంలో హార్ట్ ఆఫ్ కమర్షియల్ కేపిటల్ సిటీగా అమరావతి డౌన్ టౌన్ ఏర్పడుతుంది. ఇందులోని అసెంబ్లీ, సచివాలయం సమీపంలో సువిశాలమైన రహదారిని నిర్మిస్తారు. దీనిమీద వాహనాలను అనుమతించరు.

అమరావతి వాటర్ ఫ్రంట్ లో విశాలమైన ప్రభుత్వ భవనాలు ఉంటాయి. ఇందులో యాంపీ థియేటర్లు ఉంటాయి. సంప్రదాయ వీధి హాకర్లకు ఇక్కడికి అనుమతిస్తారు.

విజయవాడ, గన్నవరం నుంచి వచ్చే వారికి రాజధానిలోకి ప్రవేశించడానికి రెండు పెద్ద ఐకానిక్ గేట్ వేలు స్వాగతం పలుకుతాయి. వీటి నిర్మాణాలు అద్భుతంగా ఉండేలా డిజైన్ చేశారు. డౌన్ టౌన్ రోడ్డు నదీ తీరం వెంట ఏడు కిలోమీటర్లు ఉంటుంది. దీనిని 50 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు. ఇది విజయవాడ నుంచి అమరావతి వెళ్లే రోడ్డుకు సమాంతరంగా ఉంటుంది. భవిష్యత్తు విస్తరణ కోసం రోడ్డు రెండు వైపులా భారీగా ఖాళీ స్థలం వదులుతారు.

రాజధాని పరిధిలో ఇప్పుడు ఉన్న ఎల్ టీ, హెచ్ టీ లైన్లు ఉండవు. అసలు విద్యుత్తు తీగలు ఎక్కడా కనిపించవు. వాటి స్థానంలో భూగర్భ విద్యుత్తు లైన్లు ఉంటాయి. అలాగే నిరంతర విద్యుత్తు కోసం ఒక 220; మూడు 132 కేవీ సబ్ స్టేషన్లు నిర్మిస్తారు.