Begin typing your search above and press return to search.

రాహుల్ సెటైర్లు పేలుస్తున్నారండోయ్!

By:  Tupaki Desk   |   3 Feb 2018 7:36 AM GMT
రాహుల్ సెటైర్లు పేలుస్తున్నారండోయ్!
X
పార్టీకి జాతీయ అధ్యక్ష హోదా లో కాస్త అనుభవం తిరగ్గానే.. రాహుల్ బాబుకు చతుర్లు వచ్చేస్తున్నాయి. మామూలుగానే ఆయనకు సెటైర్లంటే మోజు. మోడీ మీద గతంలో కూడా చాలా సెటైర్లు వేశారు గానీ.. అందులో చాలా వరకు ఆయన అవగాహన రాహిత్యాన్నే బయటపెట్టేలా బ్యాక్ ఫైర్ అయ్యాయి. అయితే ఈసారి మాత్రం.. కాస్త సందర్భోచితంగా మంచి సెటైరే వేశారు రాహుల్. సెటైర్ తో పాటూ ఇంకొద్దిగా ప్రజల యాంగిల్ ను కూడా గుర్తించగలిగే పరిణతిని కూడా ఆయన అలవాటు చేసుకుంటే నాయకుడు అయ్యే లక్షణాలు వచ్చినట్టే అని విశ్లేషకులు అంటున్నారు.

కేంద్రం గురువారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలే ఉదయం 11 గంటలకు మొదలైంది. బడ్జెట్ లో అసలు ఉన్నదేమిటి? లాభమెవరికి? నష్టమెవరికి? అని ఆర్థికమంత్రి చదువుతూ ఉండగా అప్పటికప్పుడు అర్థం చేసుకోవడం అనేది కష్టం.. ఇలాటి పరిణామాల మధ్య గురువారం నాడు షేర్ మార్కెట్ కాస్త కుడిఎడమగా దోబూచులాడి.. సాధారణ స్థితిలో ముగిసింది.

కానీ బడ్జెట్ తాలూకు అసలు భయాలన్నీ అందరికీ శుక్రవారం ఉదయానికి తెలిసి వచ్చాయి. అంతే శుక్రవారం షేర్ మార్కెట్ ‘బేర్’ మంది. ఏకంగా 800 పాయింట్లకు పైగా పడిపోయింది. మదుపు దారులు దారుణంగా నష్టపోయారు. ఒక్కరోజులోనే బికార్లుగా మారిపోయారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో.. రాహుల్ బడ్జెట్ ప్రభావం వల్ల మార్కెట్ కుదేలవడంపై సెటైర్ వేశారు. ఆయన తన ట్విటర్ ఖాతాలో.. ‘పార్లమెంటరీ పరిభాషలో చెప్పాలంటే.. మోడీ బడ్జెట్ పై సెన్సెక్స్ 800 పాయింట్ల బలమైన అవిశ్వాస తీర్మానం ఇచ్చింది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. కరెక్టే బడ్జెట్ ప్రభావం మార్కెట్ పై ఇంత దారుణంగా ఉన్నప్పుడు.. ఎవరి అభిప్రాయమైనా ఇలాగే ఉంటుంది.

అయితే సెటైర్ బాగానే ఉంది గానీ.. రాహుల్ తెలుసుకోవాల్సిన సంగతి కూడా మరొకటి ఉన్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో సెటైర్లు అందరినీ రంజింపజేస్తాయి. కానీ భారీ నష్టాలతో లక్షల మంది మదుపుదార్లు కన్నీళ్లు పెట్టుకుంటున్న వేళ.. వేసే సెటైర్ అటు మోడీకి ఎంద చురుక్కు మనిపిస్తుందో, ఆ మదుపుదారుల్ని కూడా అంతే నొప్పిస్తుంది. ఇలాంటి సెన్సిబుల్ విషయాల్లో సెటైర్ జోలికి వెళ్లకుండా.. ‘మోడీ బడ్జెట్ లక్షల మంది మదుపుదార్ల జీవితాల్లో చీకటి నింపింది.. దీనికి జవాబుదారీతనం ఎవ్వరిది’ అనే తరహా సీరియస్ ట్వీట్ పెట్టి ఉంటే ….. ఇలాంటి సందర్భంలో బాగుండేదని పలువురు అంటున్నారు. ఇలాంటి పరిణత వ్యాఖ్యలు చేయడానికి రాహుల్ కు ఇంకా ఎంత కాలం కావాలో ఏమో అనుకుంటున్నారు.