Begin typing your search above and press return to search.

బాబుగారి అవిశ్వాస సీరియ‌ల్ మ‌ళ్లీ షురూ!

By:  Tupaki Desk   |   16 July 2018 4:22 AM GMT
బాబుగారి అవిశ్వాస సీరియ‌ల్ మ‌ళ్లీ షురూ!
X
కాలం చెల్లిన ఉత్ప‌త్తుల‌కు డిమాండ్ ఎంత‌లా ఉంటుందో.. కాలం చెల్లిన ఐడియాల‌కు ఆద‌ర‌ణ అంతేలా ఉంటుంది. కానీ.. అలాంటివేమీ ప‌ట్టించుకోకుండా తాను ప‌ట్టిన కుందేటికి మూడే కాళ్ల‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మామూలే. ఏపీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం.. మ‌రీ ముఖ్యంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌య‌త్నించాల్సిన స‌మ‌యంలో ప్ర‌య‌త్నించ‌కుండా.. ఒత్తిడి తెస్తున్న విష‌యాన్ని సైతం బ‌య‌ట‌కు చెప్ప‌కుండా గోప్య‌త ప్ర‌ద‌ర్శించిన బాబు.. ఇప్పుడు మాత్రం త‌న మిత్రుడు కాకుండా పోయిన మోడీపైన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకురంగం సిద్ధం చేసుకుంటున్నారు బాబు.

వాస్త‌వానికి ఏపీ ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం అవిశ్వాస తీర్మానం పెట్టి కేంద్ర స‌ర్కారుకు చుక్క‌లు చూపించాల‌న్న ప్రాధ‌మిక ఐడియ ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానాన్ని తెర మీద‌కు తెచ్చి స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారో.. అప్పుడు కానీ టీడీపీ అధినేత‌కు.. త‌మ్ముళ్ల‌కు తాము చేస్తున్న త‌ప్పు ఎంతో అర్థ‌మైంది. వెంట‌నే.. వారు సైతం అవిశ్వాస‌తీర్మానాన్ని కేంద్రంపై పెట్టేందుకు రెఢీ అయ్యారు.

అయితే.. గ‌త లోక్ స‌భ స‌మావేశాల్లో టీడీపీ అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకుఅధికార బీజేపీ ఎన్ని వ్యూహాలు అమ‌లు చేసింద‌న్న విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే..త్వ‌ర‌లో స్టార్ట్ కానున్న లోక్ స‌భ స‌మావేశాల్లో మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్లుగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వెల్ల‌డించారు. ప్ర‌త్యేక‌హోదాతో స‌హా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమ‌లు కాకుండాచేస్తున్న కేంద్రం తీరును ఆయ‌న తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు.

మోడీ స‌ర్కారుపై తాము పెట్ట‌నున్న అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీలు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని.. బీజేపీయేత‌ర పార్టీల‌న్ని త‌మ‌కు అండ‌గా నిల‌వాల‌ని బాబు కోరుకుంటున్నారు.

లోక్ స‌భ‌లో తాము ప్ర‌వేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి అండ‌గా నిల‌వాలంటూ ఏపీ టీడీపీ ఎంపీలు ప‌లు పార్టీల వ‌ద్ద‌కు వెళ్లి మ‌ద్ద‌తు కోరుకుతున్నారు. మ‌రోవైపు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బీజేపీ యేత‌ర... కాంగ్రెసేత‌ర పార్టీల‌కు లేఖ రాశారు. పార్ల‌మెంటులో తాము చేస్తున్న పోరాటాల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు.

విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న హామీల్ని నాలుగేళ్లు దాటినా కూడా అమ‌లు చేయ‌టం లేద‌ని.. విభ‌జ‌న చ‌ట్టంలోని అస‌మాన‌త‌ల కార‌ణంగా ఏపీ తీవ్రంగా అన్యాయానికి గురైంద‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాన విభాగంలో ఆరు హామీల‌కు నాలుగు మాత్ర‌మే పాక్షికంగా అమ‌లు చేశార‌న్నారు.

గ్రేహౌండ్స్ శిక్ష‌ణా కేంద్రం.. అసెంబ్లీ స్థానాల పెంపుపై ఇప్ప‌టివ‌ర‌కూ ఏమీ చేయ‌లేద‌ని.. షెడ్యూల్ 13లో పేర్కొన్న 11 విద్యాసంస్థ‌ల విష‌యంలోనూ తొమ్మిదింటిని మాత్ర‌మే ఏర్పాటు చేశార‌న్నారు. ఆ సంస్థ‌ల ఏర్పాటుకు రూ.11.67వేల కోట్లు అవ‌స‌ర‌మైతే.. రూ.638.19 కోట్లు మాత్ర‌మే ఇచ్చార‌న్నారు. షెడ్యూల్ 9లో 89 సంస్థ‌లు.. షెడ్యూల్ 10లోని 142 సంస్థ‌ల ఆస్తుల అప్పుల విభ‌జన ఇప్ప‌టికి వ‌ర‌కూ జ‌ర‌గ‌లేద‌న్నారు. తాము ప‌దే ప‌దే విన్న‌వించినా కేంద్రం ప‌ట్టించుకోవ‌టం లేదన్న విమ‌ర్శ‌లు చేసిన బాబు.. కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా తాము పెడుతున్న‌ అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు ప‌ల‌కాల‌ని కోరుతున్నారు. మ‌రి.. బాబు లేఖ‌కు.. త‌మ్ముళ్ల మంత్రాంగానికి ఎంత‌లా మ‌ద్ద‌తు వ‌స్తుందో చూడాలి.