Begin typing your search above and press return to search.

సర్కార్లను కూల్చుతున్న బీజేపీకి.. మిత్రుడు షాక్? బిహార్ రాజకీయం రసవత్తరం

By:  Tupaki Desk   |   8 Aug 2022 9:34 AM GMT
సర్కార్లను కూల్చుతున్న బీజేపీకి.. మిత్రుడు షాక్? బిహార్ రాజకీయం రసవత్తరం
X
దారికి వస్తే మోదీ.. దారికి రాకుంటే ఈడీ.. ఇదీ ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీరు. గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటక, నిన్నగాక మొన్న మహారాష్ట్ర.. అనేక చోట్ల ప్రభుత్వాలను మార్చివేసింది. గోవా తప్ప మిగతావన్నీ పెద్ద రాష్ట్రాలే. రాజస్థాన్ లోనూ ప్లాన్ వేసినా.. పాచిక పారలేదు. ఇక పశ్చిమ బెంగాల్ లో గతేడాది హోరాహోరీగా పోరాడినా వంద సీట్లు కూడా దక్కలేదు. అయితే, తాజాగా అక్కడ ఈడీ మమతా ప్రభుత్వాన్ని చిక్కుల్లోపెట్టింది. త్వరలోనే జార్ఖండ్ వంటి మరికొన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని చూస్తోంది. అయితే ఇలాంటి సమయంలో దేశంలో పెద్ద రాష్ట్రమైన బిహార్ లో బీజేపీకి అక్కడి సీఎం, చిరకాల మిత్రుడు నితీశ్ కుమార్ షాక్ ఇవ్వబోతున్నట్లు కనిపిస్తోంది

చిరకాల స్నేహానికి బీటలు..?

2005లో బీజేపీ అండతో బిహార్ లో నితీశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నాడు కష్టాల్లో ఉన్న నితీశ్ జనతాదళ్ యునైటెడ్ ప్రభుత్వాన్ని బీజేపీ ఆదుకుంది. ఆ నేపథ్యంలోనే రెండు పార్టీల బంధం ఇన్నాళ్లూ కొనసాగింది. మధ్యలో ఓసారి విభేదాలతో విడిపోయినా.. తర్వాత కలిశారు. అయితే.. ప్రస్తుతం వీరి కూటమిలో సంక్షోభం పెరుగుతోంది. ఏ క్షణమైనా బంధం తెగదెంపులు అయ్యేలా ఉంది. ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ సమావేశానికి నితీశ్‌ గైర్హాజరయ్యారు. అంతకుముందు మోదీతో మూడు సమావేశాలకు కూడా రాలేదు. కొవిడ్ కారణంగా తలెత్తిన ఇబ్బందులతోనే ఆదివారం నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లలేదని నితీశ్ సన్నిహితులు చెబుతున్నా.. అది అవాస్తవం అని తేలుతోంది. ఎందుకంటే ఆదివారం రాజధాని పట్నాలో నితీశ్ పలు కార్యక్రమాల్లో కనిపించారు.

మూడు రోజుల్లో సర్కారు కూలుతుందా?

కొద్దికాలంగా బీజేపీ, జేడీయూ మధ్య సఖ్యత లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ నెల 11లోగా కూటమి ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కాకపోతే దీనికి నితీశ్ పార్టీ జేడీయూ ఎమ్మెల్యేలు కొందరు సముఖంగా లేరు. ఈ నేపథ్యంలో ఆయన మధ్యంతర ఎన్నికలకు వెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో పొత్తు పెట్టుకొని అధికారం నిలుపుకొంటారని భావిస్తున్నారు.

ఆర్సీపీ సింగ్ వైదొలగడంతో..

ఆర్సీపీ సింగ్.. కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ జాతీయ మాజీ అధ్యక్షుడు కూడా. అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని జేడీయూ ఆదేశించిన నేపథ్యంలో ఆయన శనివారం పార్టీని వీడారు. కొద్ది నెలలుగా నితీశ్ కు, సింగ్‌కు పొసగడం లేదని, వార్తలు వస్తున్నాయి. సింగ్.. బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారని చెబుతున్నారు. మరోవైపు సింగ్ ను నితీశ్ ఇటీవల రాజ్యసభకు నామినేట్ చేయలేదు. పదవీ కాలం ముగియనుండడంతో ఆయన కేంద్ర మంత్రి గా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామం జేడీయూకు మరింత దూరం జరిగేలా చేసింది.

దారికి రాకుంటే లోక్ జనశక్తి గతే..

రాంవిలాస్ పాసవాన్ వంటి దళిత దిగ్గజం స్థాపించిన పార్టీ లోక్ జన శక్తిని ఆయన మరణానంతరం నిలువునా చీల్చింది బీజేపీ. పాసవాన్ కుమారుడు ఒక్కడే మిగిలేలా చేసింది. ఇలాగే జేడీయూనూ చీల్చాలని చూస్తోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ ఆరోపించారు. ఆర్సీపీ సింగ్ చాన్నాళ్లుగా బీజేపీ మనిషిగానే ఉన్నారని ఆయన చెబుతున్నారు.

కలిసి నడుద్దామని సోనియా ఫోన్

బిజేపీ-జేడీయూ సర్కారు పరిస్థితి ఇలా ఉంటే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బిహార్ సీఎం నితీశ్ కు ఫోన్ చేశారనే వార్తలు వస్తున్నాయి. మంగళవారం ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోపక్క ఆర్జేడీతో పొత్తుపై జేడీయూ ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ నీతీశ్‌పై అనుకూల వైఖరిని కనబరుస్తోంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కొద్దికాలంగా సంప్రదింపులు జరుపుతున్నారని, ఆగస్టు 11లోగా సరికొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని నెలకొల్పేలా వీరు ప్రయత్నించవచ్చని తెలుస్తోంది.

మోదీ బీజేపీకి షాకే? ఎందుకంటే..?

ఎమ్మెల్యేల బలం లేనిచోట కూడా అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్న బీజేపీకి.. బిహార్ లో అధికారం కోల్పోవడం పెద్ద షాకే. ఎందుకంటే ఆ రాష్ట్రంలో 74 సీట్లతో ఆ పార్టీనే పెద్ద పార్టీగా ఉంది. గత ఎన్నికల్లో జేడీయూకు వచ్చింది 43 సీట్లే. అంటే.. శాసన సభలో పెద్ద పార్టీగా ఉండి కూడా అధికారాన్ని త్యాగం చేసింది. ఇప్పుడు ఆ రాజీ కూడా మాజీ అవుతోంది. దీన్నిబట్టి బిహార్ లో నితీశ్ సంకీర్ణం నుంచి తప్పుకొంటే బీజేపీకి ఎంత పెద్ద షాకో చెప్పక్కర్లేదు.

చూస్తూ ఊరుకుంటుందా?

74 సీట్లు గెలుచుకుని .. కేంద్రంలో అధికారంలో కూడా ఉండి.. అదీ మోదీ, షాల హయాంలో బిహార్ వంటి రాష్ట్రంలో పరిణామాలు చేజారుతుంటే బీజేపీ చూస్తూ కూర్చుంటుందని చెప్పలేం. అవసరమైతే లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడిని దువ్వి.. ఆయన తండ్రి కేసులను చూసీ చూడనట్లు వదిలేసి.. నితీశ్ ను ప్రతిపక్షానికి తోసేస్తుందనడంలో సందేహం లేదు. మొత్తమ్మీద చూస్తే బిహార్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.