Begin typing your search above and press return to search.

నితీశ్ యూటర్న్.. ఇలా అయితే మోడీకి ప్రత్యామ్నాయం ఎలా అవుతారు పెద్దాయన?

By:  Tupaki Desk   |   5 Sep 2022 4:50 AM GMT
నితీశ్ యూటర్న్.. ఇలా అయితే మోడీకి ప్రత్యామ్నాయం ఎలా అవుతారు పెద్దాయన?
X
దేశంలో తిరుగులేని నేతగా నిలుస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయనకు ప్రత్యామ్నాయం అన్నంతనే రాహుల్ గాంధీ పేరును చెబుతున్నా.. ప్రజామోదం విషయంలో ఎదురవుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. రాహుల్ ను ప్రమోట్ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీలోనే వైరుధ్యాలు ఉన్నాయి. అలాంటి వేళ మోడీకి ఆయన్ను ప్రత్యామ్నాయం అనుకోవటంలో ఎలాంటి ప్రయోజనం లేదు. ఇదిలా ఉంటే.. మోడీకి ధీటుగా అన్న మాటకు అవకాశం లేకున్నా.. ఆయనకు దగ్గరకు వచ్చే అవకాశం ఉన్న అతి కొద్ది అధినేతల్లో బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నారు.

కేసీఆర్ తో ఉన్న పరిమితులతో పోలిస్తే.. నితీశ్ అయితే సరిగ్గా సరిపోతారన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. అవసరానికి తగ్గట్లు తనను తాను మార్చుకుంటూ.. తన చేతిలో అధికార దండాన్ని మిస్ కాకుండా చూసుకునే నితీశ్ వ్యూహాలు ఎలా ఉంటాయన్నది ఇటీవల కాలంలో చూస్తున్నదే. దేశంలోని అందరికి రాజకీయ ఝులక్ ఇచ్చే మోడీషాలకే మింగుడుపడని రీతిలో మారిన క్రెడిట్ నితీశ్ కే చెల్లుతుందని చెప్పాలి. అందరూ ఆయన మీద ఆశలు అంతకంతకూ పెంచుకుంటున్న వేళ.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు విన్నంతనే నితీశ్ తుస్ మనిపించారన్న భావన కలుగక మానదు.

మోడీ మీద వార్ ను డిక్లేర్ చేసిన అధినేతల్లో నితీశ్.. కేసీఆర్ లు కనిపిస్తారు. ఇదే జాబితాలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉన్నప్పటికీ.. వారి వరకు వారికున్న పరిమితుల కారణంగా తమ ఎజెండాకు తగ్గట్లుగా రియాక్టు అవుతుంటారు. వీరిలో వెనుకా ముందు లేకుండా నోటికి పని చెబుతున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటూ అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపిస్తారు. మాటల హడావుడి గులాబీ బాస్ ది అయితే.. చేతల్లో దిమ్మ తిరిగిపోయేలా షాకులిచ్చే సత్తా నతీశ్ కు ఉందన్న విషయాన్ని ఆయన ఇప్పటికే నిరూపించుకున్నారు.

ఇటీవల కాలంలో మోడీకి ప్రత్యామ్నాయంగా ఆయన పేరు తరచూ వినిపిస్తూ ఉంది. ఇందుకు భిన్నంగాఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త తరహా చర్చకు తెర తీశాయని చెప్పాలి. తమ పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు బీజేపీ తీర్థం పుచ్చుకోవటంపై నితీశ్ తీవ్రస్థాయిలో మండిపడటం.. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీకి 50సీట్లు కూడా రావంటూ నిప్పులు చెరిగారు. నితీశ్ నోటి నుంచి వచ్చిన మాటలకు భారీ ప్రయారిటీ ఇచ్చాయి జాతీయ మీడియా సంస్థలు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే లెక్క తేడా కొట్టేసింది. తమకు తిరుగులేదన్న రీతిలో చెలరేగిపోయే మోడీషాలు సైతం నితీశ్ మాటల గురించి ఆలోచించే అవకాశం ఉన్న పరిస్థితి. యాభైకి మించి సీట్లు రావన్న వ్యాఖ్యలు చేసిన నితీశ్ కుమార్.. తన మాటలు హాట్ టాపిక్ గా మారిన వేళ.. ఆయన యూటర్న్ తీసుకోవటం మరో పరిణామంగా చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి యాభై సీట్లు మాత్రమే వస్తాయని తాను అన్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయని.. కానీ అలాంటిదేమీ లేదన్నారు.

తాను అనని మాటల్నిఅన్నట్లుగా ప్రచారం జరిగినట్లుగా నితీశ్ చెప్పుకోవటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు.. మంచి కానీ చెడు కానీ ఒక మాట నోటి నుంచి వచ్చిన వేళ.. అందుకు భిన్నంగా మాటను వెనక్కి తీసుకోవటం చూస్తే.. యూటర్న్ దిశగా నితీశ్ అడుగులు పడినట్లేనని చెప్పాలి. ఇలాంటి తీరుతో ఉన్న నేత.. మోడీకి ప్రత్యామ్నాయం ఎందుకు అవుతారు? అన్నది ప్రశ్నగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.