Begin typing your search above and press return to search.

పెట్రోల్‌, డీజిల్ మంట‌లు.. నిర్మ‌లమ్మ‌ మాట‌లు నిజంగా షాకే

By:  Tupaki Desk   |   16 Aug 2021 5:30 PM GMT
పెట్రోల్‌, డీజిల్ మంట‌లు.. నిర్మ‌లమ్మ‌ మాట‌లు నిజంగా షాకే
X
గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతున్న పెట్రోల్ , డీజిల్ విష‌యంలో కేంద్రం తాజాగా సంచ‌ల‌న వార్త వినిపించింది. పెట్రోల్‌, డీజిల్‌ల‌పై దిగుమ‌తి సుంకాల‌ను త‌గ్గించే ప్ర‌స‌క్తే లేద‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తేల్చి చెప్పారు. త‌మ నిర్ణ‌యానికి కాంగ్రెస్ పార్టీయే కార‌ణ‌మ‌ని కేంద్ర మంత్రి సెల‌విచ్చారు. గ‌త సబ్సిడీల బ‌కాయిల చెల్లింపులే పెట్రోల్ ధ‌ర‌ల త‌గ్గింపున‌కు ఆటంకంగా ఉన్నాయ‌ని ఆమె వ్యాఖ్యానించారు.

గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం జారీ చేసిన బాండ్లు పెట్రోల్ డీజిల్ భారానికి కార‌ణ‌మ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ పేర్కొన్నారు.
కృత్రిమంగా రిటైల్ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించేందుకు కేంద్ర చ‌మురు సంస్థ‌ల‌కు యూపీఏ ప్ర‌భుత్వం బాండ్ల‌ను జారీ చేసింద‌ని నిర్మ‌లా సీతారామ‌న్ ఆరోపించారు. స‌ద‌రు ఆయిల్ బాండ్ల‌పై ఇప్ప‌టికీ త‌మ ప్ర‌భుత్వం వ‌డ్డీ చెల్లిస్తుంద‌ని పేర్కొన్నారు. రూ.1.44 ల‌క్ష‌ల కోట్ల విలువైన ఆయిల్ బాండ్ల‌ను యూపీఏ ప్ర‌భుత్వం జారీ చేయ‌డం వ‌ల్ల పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గాయని అయితే గ‌త ఐదేండ్ల‌లో ఆయిల్ బాండ్ల‌పై రూ.60 వేల కోట్ల వ‌డ్డీ చెల్లించిన‌ట్లు తెలిపారు. ఇంకా రూ.1.3 ల‌క్ష‌ల కోట్ల బ‌కాయిలు ఉన్నాయ‌న్నారు.

గ‌త యూపీఏ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని కాదని ముందుకెళ్ల‌లేమ‌ని కేంద్ర మంత్రి స్ప‌ష్టం చేశారు. ``ఆయిల్ బాండ్ల భారం మా ప్ర‌భుత్వంపై ప‌డింది. 2026 వ‌ర‌కు రూ.37 వేల కోట్ల వ‌డ్డీ చెల్లించాలి. బాండ్ల బ‌కాయి ఇంకా రూ.1.3 ల‌క్ష‌ల కోట్లు ఉన్నాయి. అందుకే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌లేక‌పోతున్నాం. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిసి చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటే త‌ప్ప ప‌రిష్కార మార్గం లేదు. ఇప్ప‌టికైతే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై ఎక్సైజ్ సుంకం త‌గ్గింపు స‌మ‌స్యే లేదు” అని నిర్మ‌లా సీతారామ‌న్ అన్నారు. ఆయిల్ బాండ్ల భారం లేకుంటే పెట్రోల్‌, డీజిల్‌ల‌పై సుంకాలు త‌గ్గించ‌గ‌లం అని ఆమె ముక్తాయించారు.