Begin typing your search above and press return to search.

సోనియాగాంధీని ఆద‌ర్శంగా తీసుకో..నీలాంటి వాళ్ల వ‌ల్లే రేప్‌ లు

By:  Tupaki Desk   |   19 Jan 2020 7:54 AM GMT
సోనియాగాంధీని ఆద‌ర్శంగా తీసుకో..నీలాంటి వాళ్ల వ‌ల్లే రేప్‌ లు
X
దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్న నిర్భ‌య దోషుల నిందితుల అంశం కొత్త మ‌లుపులు తిరుగుతోంది. ఇప్ప‌టికే తేదీల‌పై మార్పులు మాన‌వ‌త్వం ఉన్న ప్ర‌తి ఒక్క‌రినీ క‌లిచివేస్తున్నాయి. అయితే, ఈ స‌మ‌యంలో ఇంకో ట్విస్ట్ తెర‌మీద‌కు వ‌చ్చింది. నలుగురు నిర్భయ దోషులను ఫిబ్రవరి 1వ తేదీన ఉరితీయాలంటూ ఢిల్లీ అదనపు సెషన్స్‌ కోర్టు శుక్రవారం తాజాగా డెత్‌వారంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ నిర్భయ తల్లిదండ్రులకు ఆస‌క్తిక‌ర సూచ‌న చేశారు. ఉరికంబం ఎక్కబోతున్న నిర్భయ దోషులను క్షమించాలని - కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని ఉదాహరణగా తీసుకొని - ఆమె బాటలో నడువాలని సలహా ఇచ్చారు. ఇందిరా జైసింగ్‌ నిర్భయ తల్లిదండ్రులకు సూచించారు. దీనిపై నిర్భయ తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీనియర్‌ న్యాయవాది తీరును ఆక్షేపించారు.

నిర్భయ దోషుల‌కు ఉరికంభం ఎక్కే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టం - ఇదే స‌మ‌యంలో దోషుల్లో ఒక‌రైన పవన్‌ కుమార్‌ గుప్త దాఖలు చేసిన పిటిషన్‌ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరుపనుండ‌గా...ఇందిరా జైసింగ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘నిర్భయ తల్లి కడుపుకోతను నేను అర్థం చేసుకోగలను. అయితే ఆమె సోనియాగాంధీని ఉదాహరణగా తీసుకోవాలి. తన భర్తను హత్యచేసిన నళినిని సోనియా క్షమించారు. ఆమెను ఉరిశిక్ష నుంచి తప్పించారు. నిర్భయ తల్లి ఆమె బాటలో నడువాలి’ అని సూచించారు. తాను నిర్భయ తల్లికి అండగా ఉంటానని - అయితే ఉరిశిక్షకు మాత్రం వ్యతిరేకమని చెప్పారు.

అయితే, ఇందిరా జైసింగ్‌ వ్యాఖ్యలపై నిర్భయ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు మీడియ‌తో మాట్లాడుతూ.. దోషులను ఉరితీయాలని దేశం మొత్తం కోరుకుంటున్నదని చెప్పారు. తన కూతురుకు అన్యాయం చేసిన వారిని క్షమించమని సలహా ఇవ్వడానికి ఇందిరా జైసింగ్‌ ఎవరని ప్రశ్నించారు. ఇలాంటివారి వల్లే లైంగిక దాడి బాధితులకు న్యాయం జరుగడం లేదంటూ మండిపడ్డారు. ఆమె స్త్రీ జాతికే అవమానకరమని వ్యాఖ్యానించారు. ‘దోషులను క్షమించమని సలహా ఇవ్వడానికి ఇందిరా జైసింగ్‌ ఎవరు?. ఆమెకు ఎంత ధైర్యం’ అంటూ నిర్భయ తల్లి ఆశాదేవి విరుచుకుపడ్డారు.‘ఇలాంటి సలహాలు ఇవ్వడాన్ని నమ్మలేకపోతున్నా. ఇన్నేళ్ల‌లో సుప్రీంకోర్టులో ఆమెను అనేకసార్లు కలిశాను కానీ ఒక్కసారి కూడా మా బాగోగుల గురించి అడుగలేదు. కానీ ఇప్పుడు దోషుల తరఫు మాట్లాడుతున్నారు. ఆమెకు ఎంత ధైర్యం’ అని ప్రశ్నించారు. ఇలాంటివాళ్లు రేపిస్టులకు మద్దతు పలుకుతూ జీవనోపాధి పొందుతుంటారని - అందుకే దేశంలో లైంగిక దాడులు తగ్గడం లేదంటూ ధ్వజమెత్తారు. ‘ఆమె(జైసింగ్‌)లాంటివారు డబ్బులు సంపాదించేందుకు మానవహక్కుల ముసుగును వాడుకుంటారు. నాకు ఆమె సలహాలు అవసరం లేదు. ఆమెలాంటి మనస్తత్వం ఉన్నోళ్ల వల్లే లైంగికదాడులు పెరిగిపోతున్నాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.