Begin typing your search above and press return to search.

దిశ‌కు న్యాయం జ‌ర‌గ‌లేదు..నిర్భ‌య త‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   16 Dec 2019 5:03 AM GMT
దిశ‌కు న్యాయం జ‌ర‌గ‌లేదు..నిర్భ‌య త‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
హైదరాబాద్‌ దిశ ఘటన - ఉన్నావో బాధితురాలి సజీవ దహనం... మహిళలపై పెట్రోల్‌ - కిరోసిన్‌ పోసి చంపేస్తున్న వరుస ఘటనలు ఒకటికాదు.. రెండు కాదు.. పసి మొగ్గలు మొదలు మహిళల వరకూ.. కామాంధుల పైశాచికానికి బలైపోతున్నారు. ఆడపిల్లలను బయటకు పంపాలంటే కన్నతల్లులు భయంతో వణికిపోతున్న దారుణస్థితి. ఇలాంటి త‌రుణంలో...దాదాపు ఏడేళ్ల కింద‌ట ఢిల్లీలో జ‌రిగిన నిర్భ‌య ఘ‌ట‌న‌ను నేటికీ అనేక‌మంది గుర్తు చేసుకుంటారు. ఆమెకు న్యాయం జ‌రిగిందా? అని ఆలోచిస్తుంటారు. ఈ ప్ర‌శ్న‌కు నిర్భ‌య తల్లిదండ్రులు సంచ‌ల‌న స‌మాధానం ఇచ్చారు. ‘నిర్భయ’ కేసులో నలుగురు దోషులకు త్వరలో ఉరిశిక్ష అమలుచేయవచ్చని జోరుగా వార్తలు వెలువడుతుండటంతో ఇకనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని - అయినప్పటికీ దోషులకు డెత్‌ వారెంట్‌ జారీచేసి ఉరిశిక్ష తేదీని ఖరారుచేసే వరకు ఇలాంటి వార్తలను నమ్మలేమని ఆమె అన్నారు.

నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలుచేయడం ద్వారా నిర్భయకు న్యాయం జరుగుతుందని ఆమె త‌ల్లిదండ్రులు పేర్కొన్నారు. తాము కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతామని - కన్న కూతుర్ని కోల్పోయి ఎంతో క్షోభకు గురైనప్పటికీ భగవంతునిపై విశ్వాసాన్ని కోల్పోలేదని - తమకు దేవుని అండ ఉన్నదని ‘నిర్భయ’ తండ్రి చెప్పారు. ‘దిశ’ కేసులో నలుగురు నిందితులను హైదరాబాద్‌ పోలీసులు ఎన్‌ కౌంటర్‌ చేయడంతో బాధితురాలికి సత్వర న్యాయం జరిగిందని సంతోషిస్తున్న ప్రజలతో మీరూ ఏకీభవిస్తారా? అని ప్రశ్నించగా... ఈ కేసులో ఆ యువతిని కాల్చిచంపినందుకు నిందితులను శిక్షించలేదని - కనుక ‘దిశ’కు న్యాయం జరుగలేదని - కానీ ఆమె కుటుంబానికైనా శాంతి చేకూరిందని భావిస్తున్నానని ‘నిర్భయ’ తల్లి చెప్పారు.

ఈ సంద‌ర్బంగా ‘నిర్భయ’ తల్లిదండ్రులు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ బిడ్డ‌కు జ‌రిగిన ఘటన తర్వాత ‘రేప్‌ క్యాపిటల్‌'గా ఢిల్లీ అపఖ్యాతిపాలైనప్పటికీ ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉందని - మహిళలపై లైంగికదాడులు దేశమంతటా జరుగుతున్నాయని, తమ కుమార్తెను బలితీసుకొన్నప్పటికీ ఢిల్లీని అసహ్యించుకోబోమని స్పష్టం చేశారు. ‘మా సర్వస్వాన్నీ ఢిల్లీ హరించి వేసింది. అంతమాత్రన ఢిల్లీని నిందించబోము. ఎందుకంటే.. మా సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ లోనూ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరుగని ప్రదేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. కనుక మొత్తం ప్రపంచాన్ని మనం అసహ్యించుకోలేము’ అని ‘నిర్భయ’ తల్లి పేర్కొన్నారు. ఇకనైనా పరిస్థితులు బాగుపడతాయని ఆశిస్తున్నామని - అలా జరుగాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని ఆమె తెలిపారు.