Begin typing your search above and press return to search.

నీర‌వ్‌ మోడీ ని అప్ప‌గించేస్తాం

By:  Tupaki Desk   |   3 Aug 2018 5:01 PM GMT
నీర‌వ్‌ మోడీ ని అప్ప‌గించేస్తాం
X
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ ను నిండా ముంచి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోడీ విష‌యంలో కీల‌క ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ లండన్‌ లో ఉన్నాడని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయనను తమకు అప్పగించాల్సిందిగా భారత్ శుక్రవారం బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ కు చెందిన రూ.13500 కోట్ల స్కామ్‌ లో నీరవ్ మోడీ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అసలు ఈ స్కామ్ బయటపడక ముందే ఈ ఏడాది జనవరిలో అతడు దేశం వదిలి పారిపోయాడు. నిజానికి ఈ భారీ కుంభకోణంలో నీరవ్‌ తోపాటు అతని మేనమామ మేహుల్ చోక్సీ సహనిందితుడు. చోక్సీ ఇటీవల కరేబియన్ దేశమైన యాంటీగ్వాలో తేలాడు. పౌరసత్వం కూడా తీసుకున్నట్టు సమాచారం. భారత్ సంప్రదిస్తే యాంటిగ్వా కొంచెం ముందు తెలిస్తే పౌరసత్వం ఇచ్చేవాళ్లం కాదని వింత సమాధానం చెప్పి తప్పించుకుంది.

ఇదిలాఉండ‌గా...నీరవ్ లండన్ చేరాడని వదంతులు జోరందుకున్నాయి. లండన్ వీధుల్లో లాంగ్‌ కోటు వేసుకుని నీరవ్ తిరుగుతుంటే చూశామని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దాంతో ఇప్పుడు నీరవ్ కోసం బ్రిటన్‌కు భారత్ అధికారిక విజ్ఞాపన పంపింది. ఇంతకూ నీరవ్ లండన్‌ లో ఉన్నట్టు ఎలా తెలిసింది? అనే ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు! మ‌రోవైపు నీరవ్ మోడీ లండన్ నుంచి బ్రసెల్స్‌ కు పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. సింగపూర్ పాస్‌ పోర్ట్‌ పై అతను అక్కడికి వెళ్లినట్లు తెలిసింది. నిజానికి లండన్‌ లో నీరవ్ మోడీ రాజకీయ ఆశ్రయం కోసం ప్రయత్నించాడు. అతడు తమ దేశంలోనే ఉన్నాడని, ఈ విషయంలో ఇండియాకు పూర్తిగా సహకరిస్తామని యూకే కూడా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలన్నీ పత్రికల్లో రావడంతో అతడు లండన్ నుంచి బ్రసెల్స్‌ కు పారిపోయినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక వెల్లడించింది. అతడు లండన్‌ లోనే ఉన్నాడన్న బ్రిటన్ ప్రభుత్వం అధికారిక సమాచారం కోసం ఇండియన్ హై కమిషన్ వేచి చూస్తున్న సమయంలోనే నీరవ్‌ మోడీ బెల్జియంకు పారిపోవడం గమనార్హం. తన దగ్గర ఉన్న సింగపూర్ పాస్‌ పోర్ట్‌ తో అతను ఎప్పటికప్పుడు స్వేచ్ఛగా యూకే నుంచి బయటకెళ్లి మళ్లీ వస్తున్నట్లు సమాచారం.