Begin typing your search above and press return to search.

ఆనకట్ట కొట్టుకెళితే మంచిదేనట..లాజిక్ తో షాకిచ్చిన మంత్రి

By:  Tupaki Desk   |   1 Jan 2020 10:27 AM IST
ఆనకట్ట కొట్టుకెళితే మంచిదేనట..లాజిక్ తో షాకిచ్చిన మంత్రి
X
ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు ఆనకట్ట కొట్టుకుపోయి.. ప్రాజెక్టులోని నీళ్లు మొత్తం ఊళ్లలోకి వెళ్లిపోయితే ఎలా రియాక్ట్ అవుతారు? అధికారుల నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకున్న ఈ విపత్తుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. ప్రాజెక్టుకు గండి పడి మొత్తం నీళ్లు పోవటంతో ఎంత లాభమో తెలుసా? అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు చెబుతున్న లాజిక్కు వింటే అవాక్కు అవ్వాల్సిందే.

వనపర్తి జిల్లాలోని సరళాసాగర్ ప్రాజెక్టు ఆనకట్ట కొట్టుకుపోయి.. అందులోని నీళ్లు మొత్తం ఖాళీ కావటం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ ఉదంతంతో అక్కడి గ్రామాల వారు తీవ్ర అవస్థలకు గురవుతున్న పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ సమాచారం అందుకున్న జిల్లాకు చెందిన మంత్రి నిరంజన్ రెడ్డి ప్రాజెక్టు వద్దకు వచ్చి పరిశీలించారు.

ప్రాజెక్టులో నీళ్లు లేక చాలాకాలం ఖాళీగా ఉండటంతో పందికొక్కులు రంధ్రాలు పెట్టి ఉంటాయని.. దీని కారణంగా గండి పడి ఉంటుందని చెప్పారు. ఆనకట్ట కొట్టుకుపోయి ప్రాజెక్టులోని నీరంతా బయటకు వెళ్లిపోవటం ఒకందుకు మంచిదేనని వ్యవసాయమంత్రి సెలవిస్తున్నారు. ఎందుకంటే.. నీరంతా వెళ్లిపోవటం కారణంగా ప్రాజెక్టులోని ఇసుకతో ప్రభుత్వ నిర్మాణాలు ఉపయోగించుకునే వీలుందని చెబుతున్నారు. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు గండి పడి.. ఆనకట్టలు కొట్టుకుపోయి.. నీరు ఖాళీ అయితే మంచిదే అన్న మాట. ఎందుకంటే ప్రాజెక్టులో ఉండే ఇసుక లభిస్తుంది కదా? అంటే ఎలా ఉంటుంది? బాధ్యత కలిగిన మంత్రి నోట ఈ తరహా మాట రావటం విని అవాక్కు అవుతున్నారు.