Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ తో పైసా లాభం లేదంటున్న టీడీపీ ఎంపీ

By:  Tupaki Desk   |   29 Jan 2017 7:00 AM GMT
ప‌వ‌న్ తో పైసా లాభం లేదంటున్న టీడీపీ ఎంపీ
X
చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త‌గా ఉద్య‌మించ‌డం వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏమీ లేద‌ని తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం లోక్‌సభ సభ్యుడు నిమ్మల కిష్టప్ప ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత మగ్గాలను పరిశీలించి కార్మికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌ విలేఖర్లతో మాట్లాడుతూ చేనేత అభివృద్ధికి కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌ గా ఉంటానంటూ సినీనటుడు పవన్‌ కల్యాణ్ ప్ర‌క‌టించ‌డం వల్ల ఒరిగేదేమీ ఉండదని వ్యాఖ్యానించారు. చేనేత‌లు ఏమైనా స‌మ‌స్య‌లు ఎదుర్కుంటుంటే వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాన‌ని నిమ్మ‌ల కిష్ట‌ప్ప వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరును నిమ్మ‌ల కిష్ట‌ప్ప ఎద్దేవా చేశారు. ఇప్ప‌టికి ప‌లు స‌మస్యలపై పవన్‌కల్యాణ్ పోరాటాలు చేశార‌ని అయితే అందులో ఎన్నింటిలో సఫలీకృతం అయ్యార‌నేది ప‌వ‌న్ త‌నది తాను తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. వడ్డించే వారిని వదిలి ఆకులు ఎత్తివేసే వారి దగ్గరికి వెళితే ఉపయోగం ఏముంటుందని కిష్టప్ప వ్యాఖ్యానించారు. రాజ‌కీయంగా గుర్తింపు పొందాల‌నుకుంటున్న‌ వారు చేసే డిమాండ్ల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ద్ద‌తివ్వ‌డం స‌రికాద‌ని ప‌రోక్షంగా వైసీపీ, వామ‌ప‌క్ష‌ల‌తో ప‌వ‌న్ స‌ఖ్య‌తను త‌ప్పుప‌ట్టారు. విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయి, కొత్త రాష్ట్రంగా క‌ష్టాలు ప‌డుతున్న‌ ఆంధ్ర‌ప్రదేశ్ అభివృద్ధికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కృషిచేస్తున్నార‌ని, ఈ క్ర‌మంలో అంతా స‌హ‌క‌రించి రాష్ట్రం ఎదిగేందుకు ముందుకు సాగాల‌ని నిమ్మ‌ల‌ల కిష్ట‌ప్ప సూచించారు. హోదాకు స‌మాన‌మైన ప్యాకేజీతో రాష్ట్ర అభివృద్ధికి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆయ‌న వివ‌రించారు. కానీ వ్య‌క్తిగ‌త ఉద్దేశాలు, ఎజెండాలు పెట్టుకొని ముందుకు సాగ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌ద‌ని ఆయ‌న‌ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/