Begin typing your search above and press return to search.

టీడీపీ నేత‌ల గుట్టంతా బాబు కుటుంబం చేతుల్లో

By:  Tupaki Desk   |   15 July 2017 4:51 AM GMT
టీడీపీ నేత‌ల గుట్టంతా బాబు కుటుంబం చేతుల్లో
X
తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌ - ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్యలు చేశారు. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష పార్టీ తెలుగుదేశం పార్టీలో ఆ ర‌థ‌సార‌థి చంద్ర‌బాబు ఆయ‌న కుమారుడైన మంత్రి లోకేష్ ప‌ట్టు పెరిగిపోయింద‌ని అంతా కుటుంబ పాల‌న అయిపోయింద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తు చేకూరేలా చిన‌రాజ‌ప్ప వ్యాఖ్యానించారు. టీడీపీ విశాఖ కార్యాలయంలో విశాఖ అర్బన్‌ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయిన అనంతరం చిన‌రాజ‌ప్ప‌ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ పరిస్థితి పూర్వంలా లేదని, నాయకులు - ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో పూర్తిగా అధిష్టానానికి తెలుసన్నారు. 'మా జాతకాలన్నీ చంద్రబాబు దగ్గరున్నాయి. లోకేష్‌ వద్ద పార్టీ జాతకముంది' అని వ్యాఖ్యానించారు.

పార్టీ సభ్యత్వం నుంచి కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటులో లోకేష్‌ పూర్తి శ్రద్ధ పెట్టారని, మంచి పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యేలకే 2019 ఎన్నికల్లో చంద్రబాబు టిక్కెట్లు ఇస్తారని చిన‌రాజ‌ప్ప అన్నారు. తాను, మంత్రులు గంటా శ్రీనివాసరావు - అయ్యన్న పాత్రుడు కార్యకర్తలకు ఏ ఇబ్బందీ లేకుండా చూస్తామన్నారు. జీవీఎంసీ ఎన్నికలు జరగలేదని వార్డు స్థాయి నేతలు బాధపడవద్దని అందరినీ జన్మభూమి కమిటీల్లో వేస్తామన్నారు. అదే పవర్‌ పుల్‌ కమిటీ అని అన్నారు. జిల్లా కమిటీలో వరుసగా 3 సార్లు హాజరు కాకపోతే తొలగించి కొత్తవారికి అవకాశం కల్పిస్తామన్నారు. మంత్రి అయ్యన్న మాట్లాడుతూ కష్టపడే వారికి తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఇస్తుందన్నారు. వైఎస్సార్‌ పార్టీ నేతలు అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని విమర్శించారు. మంత్రి అయ్యన్న పాత్రుడుకు, తనకు మధ్య సమన్వయ లోపం వల్లే నామినేటెడ్‌ పోస్టులు భర్తీ కాలేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే వారికే పార్టీ పదవులు ఇవ్వాలన్నారు. కులాల పేరుతో సమర్థత లేనివారికి పదవులు ఇవ్వడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు.