Begin typing your search above and press return to search.

జగన్ సర్కార్ పై మళ్లీ హైకోర్టుకు నిమ్మగడ్డ రమేశ్

By:  Tupaki Desk   |   21 Oct 2020 4:00 PM GMT
జగన్ సర్కార్ పై మళ్లీ హైకోర్టుకు నిమ్మగడ్డ రమేశ్
X
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి జగన్ సారథ్యంలోని ఏపీ ప్రభుత్వంపై హైకోర్టుకు ఎక్కారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ఎపిసోడ్ ఎంత రచ్చ రచ్చ అయ్యిందో అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వంలో నియామకం అయిన నిమ్మగడ్డ వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై ఆగ్రహించిన సీఎం జగన్.. నిమ్మగడ్డను పదవి నుంచి తొలగించారు. దీనిపై నిమ్మగడ్డ హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు ఎక్కి ఎట్టకేలకు మళ్లీ ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియామకం అయ్యారు.

ఏపీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజాగా మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈసారి ఏపీ ప్రభుత్వం నుంచి ఎన్నికల కమిషన్ కు నిధులు ఇవ్వడం లేదని ఆయన పిటీషన్ దాఖలు చేశారు.

ఎన్నికల కమిషన్ నిర్వహణకు ఖర్చయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేయకుండా నిలిపివేసిందని.. ఎన్నికల నిర్వహణకు సహకరించడం లేదని నిమ్మగడ్డ పిటీషన్ లో పేర్కొన్నారు. కోర్టు వెంటనే జోక్యం చేసుకొని నిధులు విడుదల అయ్యేలా చూడాలని కోరారు.

రాజ్యాంగంలోని 243(కే) ప్రకారం ఎన్నికల కమిషన్ కు నిధులు ఆపేయడం చట్ట విరుద్ధమని నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఈ పిటీషన్ లో ప్రతివాదులుగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ,పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటెరీలను నిమ్మగడ్డ పేర్కొన్నారు. విచారణను హైకోర్టు స్వీకరించింది.