Begin typing your search above and press return to search.

బీజేపీలో చేరితే బెయిల్.. లేదంటే 10 ఏళ్లు జైలా?

By:  Tupaki Desk   |   3 July 2021 12:39 PM GMT
బీజేపీలో చేరితే బెయిల్.. లేదంటే 10 ఏళ్లు జైలా?
X
ఇప్పుడు దేశంలో హిందుత్వవాదానికి వ్యతిరేకంగా మాట్లాడితే బీజేపీ శ్రేణులు దేశ ద్రోహి ముద్ర వేస్తున్నారని ఆరోపణలున్నాయి. చాలా మంది సీఏఏ వ్యతిరేకులపై కఠిన కేసులు పెట్టి బయటకు రానీయకుండా చేశారని విమర్శలున్నాయి. తాజాగా అసోం నేత కూడా అవే ఆరోపణలు గుప్పించారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో అరెస్ట్ అయ్యి.. నిర్ధోషిగా బయటపడిన అస్సాం రైజోర్ దశ్ అధినేత, సమాచార హక్కు చట్టం కార్యకర్త అఖిల్ గొగోయ్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. తనను అరెస్ట్ చేసిన ఎన్ఐఏపై విరుచుకుపడ్డారు.

బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ లో చేరితే 10 రోజుల్లోనే బెయిల్ వస్తుందని ఎన్ఐఏ చెప్పిందని.. లేదంటే 10 ఏళ్ల పాటు జైలు జీవితం తప్పదని హెచ్చరించిందని అఖిల్ సంచలన ఆరోపణలు చేశారు.ఇక బీజేపీలో చేరితే మంత్రి పదవి కూడా లభిస్తుందని ఓ ఎన్ఐఏ అధికారి ఆఫర్ చేసినట్లు అఖిల్ గొగోయ్ పేర్కొన్నారు. అందుకు తాను తిరస్కరించానని చెప్పుకొచ్చారు.

బీజేపీకి వ్యతిరేకంగా అసోం నేత అకిల్ గొగోయ్ సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో విసృతంగా పాల్గొన్నారు. ఇటీవల జరిగిన అసోం ఎన్నికల్లో పాల్గొని జైలు నుంచే ఎమ్మెల్యేగా గెలుపొంది సంచలనం సృష్టించారు. ఎట్టకేలకు ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు.2019 డిసెంబర్ లో సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై నమోదైన రెండు కేసుల్లో అఖిల్ గొగొయ్ అరెస్ట్ అయ్యారు.

ఆ రెండు కేసుల్లోనూ అతడిపై అభియోగాలను ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత జైలు నుంచి అఖిల్ బయటపడ్డారు. విడుదల అనంతరం అఖిల్ సత్యం గెలిచిందని చెప్పుకొచ్చారు. తనను జైల్లో ఉంచడానికి ప్రయోగించిన ఉపా చట్టంపై ఇకపై తన పోరు కొనసాగుతుందని అఖిల్ చెప్పాడు.

తనను సీఏఏ ఆందోళనల్లో కేసులతో జైల్లోనే ఉంచాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టాయన్నారు. రేపు తన నియోజకవర్గం శివసాగర్ లో పర్యటించి ప్రజలకు ధన్యవాదాలు చెబుతానని చెప్పారు.