Begin typing your search above and press return to search.

కరోనా మృతుల గౌరవాన్ని కాపాడాలి .. కొత్త చట్టానికి డిమాండ్ చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ !

By:  Tupaki Desk   |   16 May 2021 1:30 AM GMT
కరోనా మృతుల గౌరవాన్ని కాపాడాలి .. కొత్త చట్టానికి డిమాండ్ చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ !
X
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ముఖ్యంగా మొదటి వేవ్ తో పోల్చుకుంటే సెకండ్ వేవ్ లో ఈ కరోనా కేసులు , మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా దేశంలో రోజుకి నాలుగువేల మందికి పైగానే మరణిస్తున్నారు. అయితే , కరోనా తో మరించిన వారి మృతదేహాలని తీసుకువెళ్లడానికి వారి కుటుంబ సభ్యులు కూడా జంకుతుండటం తో కరోనా మృతుల అంతిమ సంస్కారాల్లో కనీసం వారికి సరైన గౌరవం కూడా లభించడం లేదు. ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌ హెచ్‌ ఆర్‌ సీ) కేంద్రం, రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. కరోనా కారణంగా మరణించిన వారి గౌరవ ప్రతిష్ఠలు కాపాడేలా కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది.

ఈ మేరకు పలు ప్రతిపాదనలు చేసిన ఎన్‌ హెచ్‌ ఆర్‌ సీ సామూహికంగా అంత్యక్రియలు జరగకుండా చూడాలని ,సామూహిక ఖననాలు మరణించిన వారి గౌరవాన్ని దిగజార్చుతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజాగా బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లో గంగానదిలో కొవిడ్‌ రోగుల మృతదేహాలు తేలిన విషయం తెలిసిందే. దీనితో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌ హెచ్‌ ఆర్‌ సీ) కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లో గంగా నదిలో అనేక మృతదేహాలు తేలుతూ కనిపించడంతో ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ ప్రభుత్వ అధికారులు తమ విధుల్లో విఫలమయ్యారని, ఇది గంగాపై ఆధారపడే ప్రజలను ప్రభావితం చేస్తుందని ఎన్‌ హెచ్‌ ఆర్‌ సీ తెలిపింది. నదిలో రోజు చేసే కార్యకలాపాలపై ప్రభావం పడుతోందని ఎన్‌ హెచ్‌ ఆర్‌ సీ తెలిపింది. అలాగే బిల్లులు చెల్లించలేదని మృతదేహాలను ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు అట్టిపెట్టుకోకుండా చూడాలని, గుర్తు తెలియని మృతదేహాలను జాగ్రత్తగా భద్రపరచాలని సూచించింది. గుర్తు తెలియని, చనిపోయిన వారి గురించి రాష్ట్ర అధికారులు తప్పక సమాచారాన్ని నిర్వహించాలని పేర్కొంది. అలాగే అంత్యక్రియలు నిర్వహించే సిబ్బందికి అవసరమైన భద్రతా పరికరాలు, సౌకర్యాలు కల్పించాలని, అప్పుడే తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించగలరని తెలిపింది. మతపరమైన ఆచారాలు పాటించేందుకు అనుమతి ఇవ్వాలని, కొవిడ్‌ మృతులకు చివరి ఖర్మలు చేయలేని స్థితిలో ఉన్నా, ముందుకు వారికి స్థానిక పరిపాలన సాంస్కృతిక అంశాలను పరిగణలోకి తీసుకొని అంత్యక్రియలు పూర్తి చేయాలని వెల్లడించింది.

ఇదిలా ఉంటే , దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరణమృదంగం కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,26,098 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా , 3,890 మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. 24 గంటల్లో 3,53,299 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,43,72,907కి చేరింది. అలాగే మొత్తం 2,04,32,898 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 36,73,802 యాక్టీవ్ కేసులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,66,207గా ఉంది.