Begin typing your search above and press return to search.

రెబెల్ బెల్స్ : వైసీపీలో మాలావు అసంతృప్త ఎంపీ...?

By:  Tupaki Desk   |   27 July 2022 2:30 PM GMT
రెబెల్ బెల్స్ : వైసీపీలో మాలావు అసంతృప్త ఎంపీ...?
X
ఏపీలో మూడేళ్ల వైసీపీ పాలన చూశారు. జనాలకు ఎలా ఉందో కానీ సొంత పార్టీలోని ప్రజా ప్రతినిధులకు లెక్కలు అన్నీ చాలా బాగానే తెలుస్తున్నాయి. గ్రౌండ్ రియాలిటీస్ కూడా అర్ధమవుతున్నాయి. అదే టైమ్ లో పార్టీలో తమకు ఉన్న విలువ గౌరవం కూడా వారు బేరీజు వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచిస్తున్నారు. ఇక అనేక కారణాల వల్ల చాలా మంది ఎంపీలు వైసీపీలో అసంతృప్తితో రగులుతున్నారు అని అంటున్నారు.

వైసీపీకి 2019 ఎన్నికల్లో 22 మంది ఎంపీలు గెలిచారు. అందులో తొలి ఆరు నెలలలోనే నర్సాపురం ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు రెబెల్ అయి జగన్ కే సవాల్ అంటూ ఢిల్లీలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆయన రెండున్నరేళ్ళుగా అధినాయకత్వానికి ఏ మాత్రం లొంగడంలేదు. పైగా తలనొప్పిగా తయారయ్యారు.

ఆ వరసలో మరింతమంది ఎంపీలు అన్న మాట కూడా వినిపిస్తోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పక్క చూపులు చూస్తున్నారు అని ప్రచారం జరిగింది. అయితే ఆయన లేటెస్ట్ గా 2024 ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ తరఫునే పోటీ చేస్తాను అని చెప్పుకొచ్చారు, ఒక విధంగా క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయన చెప్పినా కూడా ప్రచారం మాత్రం ఆగడంలేదు. ఇది రాజకీయం కాబట్టి ఎపుడేమి జరుగుతుందో ఎవరికి తెలుసు అని అంటున్నారు.

ఇపుడు చూస్తే మరో ఎంపీ రెబెల్ గా మారి డేంజర్ బెల్స్ మోగిస్తున్నారా అన్న డౌట్లు వైసీపీలో పుట్టుకువస్తున్నాయట. ఆయనే పల్నాడు జిల్లా నర్సారావుపేట ఎంపీ లావు శ్రీక్రిష్ణదేవరాయలు. ఆయన పార్టీలో అంత సుఖంగా ఏమీ లేరని అంటున్నారు. అక్కడ లోకల్ మినిస్టర్ విడుదల రజనీతో ఆయనకు ఆది నుంచి విభేదాలు ఉన్నాయని చెబుతారు. ఆమె కూడా ఆయన్ని పట్టించుకోకపోవడంతో వివాదం ముదురుతోంది. దీన్ని సరిచేయాల్సిన హై కమాండ్ పట్టించుకోవడంలేదు. ఇక రజనీకి బాగా విలుగ గౌరవం పార్టీలో దక్కుతున్నాయి.

దాంతో లావు ఇపుడు హై కమాండ్ మీద మాలావు అసంతృప్తినే పెంచుకున్నారు అని అంటున్నారు. దాన్ని ఆయన చూపించిన తీరే పార్టీలో చర్చగా ఉంది. ఆయన ఢిల్లీలో వెళ్ళి వెళ్ళి టీడీపీ అసంతృప్తి ఎంపీ కేశినేని నానిని కలిశారు. ఆయన నివాసంలో విపక్ష ఎంపీలతో కలసి గ్రూప్ ఫొటోలు ఇచ్చారు.

విపక్ష ఎంపీలను కేశినేని నాని తన నివాసానికి ఆహ్వానించారు. అలా వెళ్ళిన వారిలో టీడీపీకి చెందిన గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహనరావు. డీఎంకేకు చెందిన కనిమొళి. ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, శివ‌సేన ఎంపీ ధైర్య‌శీల్ మానే వంటి వారు ఉన్నారు. అయితే వారితో పాటే లావు కూడా అక్కడ ప్రత్యక్షం కావడం చిత్రం. మరి వైసీపీకి చెందిన ఏ ఒక్క ఎంపీ కూడా కేశినేని నివాసానికి రాలేదు. లావు వెళ్లారూ అంటే తన అసంతృప్తిని హై కమాండ్ పట్టించుకోవాలనే ఇలా చేశారని అంటున్నారు.

అయితే ఈ పరిణామాలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్న హై కమాండ్ ఇప్పటికిపుడు లావుని పిలిచి మాట్లాడేది ఏమీ ఉండబోదు అంటున్నారు. అయితే లావు కదలికలను గమనిస్తారు అని అంటున్నారు. ఒక విధంగా చూస్తే కేవలం రెండేళ్ళు మాత్రమే టైమ్ ఉంది కాబట్టి ఎంపీలు ఇలా చేసినా ఆల్టర్నేషన్ ని అక్కడ రెడీ చేయడానికి చూస్తారు అని చెబుతున్నారు. మొత్తానికి లావు విషయంలో వైసీపీ అయితే సైలెంట్ గానే ఉండవచ్చు అంటున్నారు. అయితే ఆయన శృతి మించితే మాత్రం అపుడు యాక్షన్ ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా లావు అయితే ఊరుకునే రకం కాదని అంటున్నారు. ఆయన ఇవాళ ఒక సంకేతం ఇచ్చారు రేపు నోరు విప్పితే అది వైసీపీకి రెబెల్ బెల్స్ మోగించినట్లే అని అంటున్నారు.