Begin typing your search above and press return to search.

రాజు గారి తెలివే తెలివి : సొంత పార్టీ కంటే వారితోనే...?

By:  Tupaki Desk   |   21 Aug 2022 2:30 AM GMT
రాజు గారి తెలివే తెలివి :  సొంత పార్టీ కంటే వారితోనే...?
X
ఆయన మాజీ ఎమ్మెల్యే. బీజేపీ పక్షాన రాష్ట్ర శాసనసభలో ఫ్లోర్ లీడర్ గా కొంతకాలం వ్యవహరించారు. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయినా కూడా ఏపీలో తనకంటూ పేరును సంపాదించుకున్నారు. ఆయెన విశాఖకు చెందిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు. ఆయన వచ్చే ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి మరోమారు అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. అందుకోసం ఆయన చేస్తున్న గ్రౌండ్ వర్క్ మామూలుగా అయితే లేదు.

బీజేపీకి ఆయన ఉత్తరాన పెద్ద దిక్కు. ఆ మాటకు వస్తే సిటీలో గెలిచే సీటు బీజేపీకి ఏదైనా ఉంది అంటే నార్త్ నే చూపిస్తారు. ఇక క్యాడర్ ఎంతో కొంత అక్కడే కనిపిస్తుంది. జీవీఎంసీ ఎన్నికలు గత ఏడాది జరిగితే అంతటి భీకరమైన పోటీలోనూ విశాఖ నార్త్ నుంచి ఒక కార్పోరేటర్ ని బీజేపీ తరఫున రాజు గారు దగ్గరుండి గెలిపించుకున్నారు.

ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసింది. నాడు చాలా మందికి ఓట్లు దారుణంగా వచ్చాయి. కానీ రాజు గారికి దాదాపుగా ఇరవై వేల దాకా విశాఖ నార్త్ లో వచ్చాయి అంటే ఆయన సొంత ఇమేజ్ వల్లనే అని చెప్పాలి. ఆయన అన్ని వర్గాలను కలుపుకుంటూ పోతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవాలన్న మాస్టర్ ప్లాన్ తో ఆయన ముందుగా మిత్రులను తానుగా దగ్గర చేసుకుంటున్నారు.

రాజు గారికి ఏపీలో పొత్తులు ఉంటాయని తెలుసు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కలసి పోటీ చేస్తాయని ఆలోచనతో ఆయన ఇప్పటి నుంచే టీడీపీ వారితో మంచిగా ఉంటున్నారు.తన నియోజకవర్గంలో వారితో చెట్టాపట్టాల్ వేస్తున్నారు. అలాగే జనసేన నాయకులను కూడా చేరదీసి తనకు మద్దతు ఇచ్చేలా చూసుకుంటున్నారు. ఇక ఒక వైపు చంద్రబాబుని వీలు దొరికినపుడల్లా పొగుడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తోనూ మంచిగా ఉండేలా చూసుకుంటున్నారు.

ఇక్కడ టీడీపీ తరఫున గంటా శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన వేరే సీటు నుంచి పోటీకి దిగుతారు అని అంటున్నారు. ఉత్తరాన టీడీపీకి మంచి క్యాడర్ ఉంది కానీ సరైన లీడర్ లేరు. అలాగే జనసేనకు 2019 ఎన్నికల్లో 18 వేల ఓట్లు దాకా వచ్చాయి. అయితే స్ట్రాంగ్ లీడర్స్ ఆ పార్టీకి కావాలి. ఈ రెండు పార్టీలలో ఉన్న లీడర్ షిప్ లోటుని చూసిన రాజు గారు పొత్తులలో భాగంగా తనకు ఈ సీటు ఇస్తారని ఆశిస్తున్నారు. అలా కనుక జరిగితే మాత్రం తాను కచ్చితంగా గెలిచి తీరుతాను అని ఆయన నమ్మకంగా ఉన్నారు.

అందుకే ఆయన చంద్రబాబు పాలన భేష్ అంటున్నారు. విశాఖలోని టీడీపీకి చెందిన వారితో కలసి తిరుగుతున్నారు. అయితే బీజేపీకి చెందిన రాజు గారు టీడీపీ వారితో చనువుగా ఉండడం, వారిని పొగుడుతూ పోవడం పట్ల సొంత పార్టీలో చర్చ సాగుతోంది. కానీ ఆయనకు బీజేపీలో కూడా జాతీయ నేతల మద్దతు ఉంది అంటున్నారు. మరి రాజు గారి గురి కుదిరి పొత్తులు కలసి వచ్చి టికెట్ దక్కితే ఎమ్మెల్యే అవుతారా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే అక్కడ ఉన్న వైసీపీ క్యాండిడేట్ కూడా గట్టి వారే. ఆయనే వైసీపీ నేత కేకే రాజు. ఆయన కూడా 2019లో ఓడిన దగ్గర నుంచి జనంతోనే ఉంటున్నారు. అయితే ఈసారి వైసీపీకి యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది అన్న అంచనాలు ఉన్నాయి. అందుకే బీజేపీ రాజు గారి అనుచరులు మా సారే ఎమ్మెల్యే అనేస్తున్నారుట.