Begin typing your search above and press return to search.

ఆదిలాబాద్ కారుకు పంక్ఛ‌ర్లు ప‌డుతున్నాయ్‌.. జ‌ర భ‌ద్రం కేసీఆర్‌!!

By:  Tupaki Desk   |   31 July 2022 3:30 AM GMT
ఆదిలాబాద్ కారుకు పంక్ఛ‌ర్లు ప‌డుతున్నాయ్‌.. జ‌ర భ‌ద్రం కేసీఆర్‌!!
X
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అదికార పార్టీ నేత‌ల మ‌ధ్య‌ మునుపెన్నడూ లేని విధంగా అసంతృప్తి రాజుకుంటోంది. నేతల మధ్య అంతరం పెరుగుతోంది. పునర్విభజన తరువాత ఆదిలాబాద్‌, బోధ‌న్‌ నియోజకవర్గాలతో పాటు ఖానాపూర్‌ నియోజకవర్గానికి చెందిన రెండు మండలాలు, ఆసిఫాబాద్‌ నియోజకవర్గానికి చెందిన రెండు మండలాలతో నూతన జిల్లా అవతరించింది. రెండోసారి శాసనసభ ఎన్నికల అనంతరం నేతల మధ్య రాజకీయ వైరం పెరిగింది.

జిల్లాల‌ పునర్విభజన తరువాత ఆదిలాబాద్‌, బోధ‌న్‌ నియోజకవర్గాలతో పాటు ఖానాపూర్‌ నియోజకవర్గానికి చెందిన రెండు మండలాలు(ఉట్నూర్‌, ఇంద్రవెల్లి), ఆసిఫాబాద్‌ నియోజకవర్గానికి చెందిన రెండు మండలాలు (నార్నూర్‌, గాదిగూడ)లతో నూతన జిల్లా ఏర్ప‌డింది. బోధ‌న్ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల్లోనే ఆధిపత్య పోరు స్పష్టంగా కొనసాగుతోంది.

ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు వర్గానికి రాష్ట్ర డెయిరీ మాజీ ఛైర్మన్‌ లోకభూమారెడ్డి, బోధ‌న్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌లతో కలిపి మాజీ ఎంపీ గోడం నగేష్‌ మరో వర్గంగా కొనసాగుతున్నారు. బోధ‌న్‌ మండలంలో ఉపాధి హామీ పథకంలో చోటుచేసుకున్న అక్రమాల పరంపర మూడునెలల కిందటనే జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని కుదిపేసింది. తాజాగా ప్రభుత్వం ఖరారుచేసిన కొత్తమండలాల జాబితాలో సొనాల ప్రస్తావన లేకపోవడంతో బోథ్‌ తెరాసలో మరోసారి అసంతృప్తి రాజుకుంది.

ఎమ్మెల్యే బాపురావు అడ్డుకోవడంతోనే సొనాల మండలం ఏర్పాటు కాలేదని ఆయన వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. సొనాల కేంద్రంగా నిరసనలు, వంటావార్పు, అక్టోబరు 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఎంపీపీ తుల శ్రీనివాస్‌ ప్రకటించడం రాజకీయ వ్యూహంలోని భాగమేనని ఎమ్మెల్యేవర్గం పేర్కొంటోంది. తాజాగా తుల శ్రీనివాస్‌ తనను కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే బాపురావు అనుచరుడైన నేరడిగొండకు చెందిన బోధ‌న్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ దావుల భోజన్న పోలీసులకు ఫిర్యాదు చేయడం రాజకీయ వైరాన్ని బహిరంగపర్చింది.

ఎంపీపీ తులశ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ దావుల భోజన్న ఒకే పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నేతలైనా సఖ్యత చేకూర్చే ప్రయత్నం జరగడంలేదు. ఖానాపూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేఖానాయక్‌, జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్‌ వర్గాల మధ్య సఖ్యత లేదు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్టే లక్ష్యంగా ఎవరి వర్గం వారిదన్నట్లుగా రాజకీయం నడిపిస్తుండటం పార్టీ శ్రేణులను ఇరకాటంలోకి నెడుతోంది. ఎవరితో సాన్నిహిత్యంగా ఉంటే ఏమవుతుందోననే ఆందోళన కనిపిస్తోంది.

నిర్మల్‌ జిల్లా పెంబి ఎంపీపీ కవిత భర్త గోవింద్‌కు ఎమ్మెల్యే రేఖానాయక్‌ మధ్య పెంబిలో చోటుచేసుకున్న గోడవ ప్రభావం ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌, నార్నూర్‌, ఇంద్రవెళ్లి మండలాల్లో అంతర్గత క‌ల‌హం కనిపిస్తోంది. రాజకీయ పంతాన్ని నెగ్గించుకోవడానికి నేతలు చేస్తున్న ఎత్తుగడలు కార్యకర్తలకు ఇబ్బందులు తెచ్చిపెట్టేలా మారుతోంది. ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైన ఏజెన్సీ ప్రాంతాల్లో వేర్వేరుగా పర్యటించడం నేతల మధ్య దూరాన్ని వెల్లడిస్తోంది.

అంతా బాగుంటుందనుకుంటున్న ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో చాపకింద నీరులా అసమ్మతి రాజుకుంటుండడంతో పార్టీ అధినేత జోక్యం చేసుకోవాల‌ని.. నాయ‌కులు కోరుతున్నారు. డీసీసీబీ ఎన్నికల వరకు అత్యంత సన్నిహిత మిత్రులుగా పేరున్న ఎమ్మెల్యే జోగు రామన్న - బోధ‌న్‌ ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు మధ్య ఇప్పుడు అంతరం పెరిగింది. బాపురావు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో సన్నిహితంగా మెలుగుతుండటం రామన్న వర్గం జీర్ణించుకోలేకపోతోంది.

అదే సమయంలో తనను లక్ష్యంగా చేసుకున్న గోడం నగేష్‌, లోక భూమారెడ్డి, తుల శ్రీనివాస్‌ని జోగు రామన్న వెనకేసుకొస్తున్నారనేది బాపురావు వర్గం నుంచి వినిపిస్తోంది. అవకాశం చిక్కినప్పుడల్లా ఎవరికివారు అధిష్ఠానం పెద్దలకు ఫిర్యాదులు చేసుకునే దాకా వెళ్తోంది. జోగు రామన్న జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత శ్రేణుల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేయకపోవడం అసంతృప్తికి మరింత ఆజ్యం పోసినట్లవుతోంది. మ‌రి కేసీఆర్ జోక్యం చేసుకుంటారా.. కేటీఆర్ జోక్యం చేసుకుంటారో.. తెలియ‌దు కానీ.. ఈ వివాదంలో ఇత‌ర పార్టీల జోక్యం పెరిగితే.. అధికార పార్టీకి ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.