Begin typing your search above and press return to search.

'బండి'కి బ్రేకులు వేసేలా కేటీఆర్ ప్రశ్నలు

By:  Tupaki Desk   |   15 April 2022 9:51 AM GMT
బండికి బ్రేకులు వేసేలా కేటీఆర్ ప్రశ్నలు
X
బీజేపీ అసలు తమకు ప్రత్యర్థియే కాదని చాలా సందర్భాల్లో కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు నొక్కివక్కాణించారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు టీఆర్ఎస్ నేతలకు బీజేపీయే ప్రధాన ప్రత్యర్థిగా మారింది. అందుకే చీటికి మాటికి.. కలలో కూడా బీజేపీని కలవరిస్తున్నారు కేసీఆర్, కేటీఆర్ లు.. ఇటీవల వరి కొనుగోలుపై కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మరీ ధర్నా చేశారు. ఇక కేటీఆర్ తగ్గేదేలే అంటూ మోడీ నుంచి అమిత్ షా, నడ్డా, బండి సంజయ్ వరకూ కడిగేస్తూనే ఉన్నాడు. తాజాగా బండి సంజయ్ యాత్ర నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిప్పుడు వైరల్ అయ్యాయి.

'ప్రజా సంగ్రామ యాత్ర' పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది పాదయాత్ర కాదని.. ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కరువుకాటకాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి.. హరితమయంగా మారుతున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై బండి సంజయ్ పగబట్టారని ఆరోపించారు. అందుకే అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించారన్నారు. పాలమూరుకు బీజేపీ చేసిన ద్రోహం, ప్రాజెక్టుల మంజూరులో చూపిన నిర్లక్ష్యం, నిధుల విడుదలలో కేంద్రప్రభుత్వం చేసిన వంచనకు పాలమూరు ప్రజానీకానికి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక బీజేపీ వైఫల్యాలను ఈ సందర్భంగా కేటీఆర్ ఎత్తిచూపి బండి సంజయ్ ను డిఫెన్స్ లో పడేసేలా.. మహబూబ్ నగర్ ప్రజలు, నేతలు నిలదీసేలా ముందే స్కెచ్ గీసినట్టుగా అర్థమవుతోంది. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ఎగతాళి చేస్తున్న నియంతృత్వ బీజేపీ అంటూ క్షమాపణ చెప్పాకే బండి పాదయాత్ర కదలాలని కేటీఆర్ డిమాండ్ చేయడం విశేషం.

ఈ క్రమంలోనే సెంటిమెంట్ ను రగిలించి బండి పాదయాత్రకు స్పందన రాకుండా వ్యతిరేకత పాదుగొలిపే చర్యలకు కేటీఆర్ దిగినట్టు తెలుస్తోంది. అందుకే కృష్ణా జలాల అంశాన్ని తాజాగా కేటీఆర్ లేవనెత్తారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడీకి పాల్పడుతూ పాలమూరు రైతులకు ద్రోహం చేస్తున్న బీజేపీని నిలదీయాలని కేటీఆర్ వ్యూహాత్మక జలవివాదాలను పైకి లేపారు.

పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వమని చేసిన విజ్ఞప్తికి కేంద్రం ఎందుకు సమాధానం చెప్పలేదని.. దీన్ని నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కర్ణాటకపై కనికరం చూపి.. పక్కనే ఉన్న పాలమూరుకు ఎందుకు కక్ష పెంచుకున్నారని.. అక్కడి ప్రజల సెంటిమెంట్ ను జలవివాదాలను రెచ్చగొట్టేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉండడం చర్చనీయాంశమైంది.

కేటీఆర్ తీరు చూస్తే ఖచ్చితంగా బండి సంజయ్ పాదయాత్రను మహబూబ్ నగర్ లో జరగనీయకుండా చేసే ఎత్తుగడగా కనిపిస్తోంది. దీన్ని బండి ఎలా ఎదుర్కొంటాడన్నది వేచిచూడాలి.