Begin typing your search above and press return to search.

ఒక జిల్లా రెండు పార్టీ ఆఫీస్‌లు.. టీడీపీలో వ‌ర్గ‌పోరు!

By:  Tupaki Desk   |   30 April 2022 9:30 AM GMT
ఒక జిల్లా రెండు పార్టీ ఆఫీస్‌లు.. టీడీపీలో వ‌ర్గ‌పోరు!
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో వ‌ర్గ పోరు త‌గ్గించుకోవాల‌ని.. పార్టీకి అంద‌రూ విధేయులుగా ఉండాల‌ని పార్టీ అదినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఈ మాట‌లు ఎవ‌రూ పెద్ద‌గా చెవిని ఎక్కించుకుంటున్న‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. దాదాపు స‌గానికి పైగా జిల్లాల్లో టీడీపీ వ‌ర్గ పోరు సాగుతోంది. ఇక‌, ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గంలో నాయ‌కులు ఏకంగా.. రెండుగా చీలి పోయి.. ఎవ‌రి వారే య‌మునా తీరే అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఒంగోలులో పార్టీని బ‌లోపేతం చేసే క్ర‌మంలో దామ‌చ‌ర్ల కుటుంబం ఎన్నో ఏళ్లుగా టీడీపీకి అంకిత భావంతో ప‌నిచేస్తోంది. దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌.. ఒంగోలు పార్టీ ఇంచార్జ్‌గా.. 2009, 2014లో ఇక్క‌డ పార్టీ త‌ర‌ఫున ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆయ‌న సోద‌రుడు దామ‌చ‌ర్ల స‌త్య కూడా ఇక్క‌డ పార్టీనిముందుకు న‌డిపిస్తున్నారు. దీంతో దామ‌చ‌ర్ల వర్గం ప్ర‌భావం ఎక్కువ‌గానే ఉంది. అయితే.. గ‌తంలో వైసీపీ ప‌నిచేసిన నూక‌సాని బాలాజీ.. అక్క‌డ త‌న‌కు టికెట్ ద‌క్క‌ద‌న్న ఉద్దేశంతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ఆయ‌న‌కు టీడీపీ ఒంగోలు పార్లమెంట్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. గ‌తంలో వైసీపీలో ఉండగా.. ప్ర‌కాశం జడ్పీ చైర్మన్ అభ్యర్దిగా ప్రకటించారు. అయితే.. బాలినేని వ‌ర్గం దెబ్బ‌తో ఈ ప‌ద‌వి నూక‌సానికి ద‌క్క‌లేదు. దీంతో పార్టీపై అలిగిన ఆయ‌న టీడీపీలో చేరిపోయారు. పార్టీలోకి వ‌చ్చిన నూక‌సానికి చంద్ర‌బాబు స‌ముచిత గౌర‌వం ఇచ్చారు. కొంతకాలానికి తాను అనుకున్న ప్రకారం జడ్పీ చైర్మన్ అయ్యారు.

అయితే దాదాపు నాలుగుసార్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన దామచర్ల జనార్దన్‌తో నూక‌సారి విభేదించారు. అప్పటి వరకూ ఉన్న టీడీపీ కార్యాలయానికి వెళ్లకుండా సొంతగా పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఒంగోలులో మొదటి నుండి ఉన్న ఎన్టీఆర్ భవన్‌తోపాటు టీడీపీ పార్లమెంట్ పార్టీ కార్యాలయాలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. నూకసాని ఎన్టీఆర్ భవన్‌కు రాకపోవటంతో.. ఆయన ప్రారంభించిన పార్లమెంట్ పార్టీ కార్యాలయానికి దామచర్ల వెళ్లడం లేదు.

ఇద్ద‌రు కీల‌క నేత‌లు ఉండి కూడా పార్టీని ముందుకు న‌డిపించ‌డం మానేసి.. ఒకరితో ఒకరికి సంబంధం లేదన్నట్టుగా పార్టీ కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబు పార్టీని బ‌లోపేతం చేయాల‌ని ఆదేశిస్తున్నా.. నూక‌సాని మాత్రం.. పార్టీ పార్ల‌మెంట‌రీ అధ్య‌క్షుడిగా ఉండి కూడా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూచ‌క్రం తిప్పుతున్నార‌ని, పూర్తిస్థాయిలో ప‌నిచేయ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వస్తున్నాయి.

మ‌రోవైపు.. మే చివ‌రి వారంలో ఒంగోలు కేంద్రంగా మ‌హానాడు నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ టీడీపీ చీఫ్‌ అచ్చెన్నాయుడు ఒంగోలు వచ్చారు. అక్కడ టీడీపీకి రెండు ఆఫీసులు ఉన్నాయని తెలుసుకుని ఆయ‌న ఆశ్చ‌ర్య పోయారు. నూకసాని, దామచర్ల వ్యవహారశైలి తెలుసుకుని సీరియస్‌ అయినట్టు సమాచారం. జిల్లాలోని ఎమ్మెల్యేలు.. మాజీ ఎమ్మెల్యేలు.. నియోజకవర్గాల ఇంఛార్జులతో సమావేశమైన అచ్చెన్న… నూకసానిని తనదైన శైలిలో మందలించారట.

పార్టీ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకొని పోవాలని చెబుతూనే.. ఫ్లెక్సీలలో దామచర్ల ఫొటోలు లేకపోవడా న్ని గట్టిగానే తప్పుపట్టారని స‌మాచారం. టీడీపీలోని సీనియర్లను గౌరవించకపోతే.. అంతిమంగా పార్టీనే నష్టపోవాల్సి వస్తుందని హితవు పలికారట అచ్చెన్న. అంతేకాదు.. ''నీకు ప‌ద‌వులు రావ‌డానికి దామ‌చ‌ర్ల సాయం చేసిన విష‌యాన్ని మ‌రిచిపోతున్నావా?'' అని కూడా ప్ర‌శ్నించిన‌ట్టు టడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎన్టీఆర్‌ భవన్‌కు వెళ్లేందుకు నూకసాని ఒప్పుకొన్నట్టు సమాచారం. మొత్తానికి ఎన్నిక‌లకు ముందు ఈ వివాదం ప్ర‌స్తుతానికి ప‌రిష్కారం అయినా.. మున్ముందు ఎలా ఉంటుందో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.