Begin typing your search above and press return to search.

టీడీపీ గెలవబోతోంది...విశాఖ ఆక్టోపస్ జోస్యం..?

By:  Tupaki Desk   |   10 Jan 2023 1:30 PM GMT
టీడీపీ గెలవబోతోంది...విశాఖ ఆక్టోపస్ జోస్యం..?
X
వచ్చే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ ఏపీలో గెలవబోతోంది అంటే అది ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఈసారి హోరా హోరీ ఫైట్ ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. అధికార వైసీపీకి విపక్ష తెలుగుదేశం పార్టీకి కూడా ఈసారి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవి అని చెప్పాలి. అయితే అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే వ్యతిరేకత ఉంటుంది.

అదే టైంలో విపక్షంలో ఉన్నది తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ఆయన రాజకీయ వ్యూహాలను ఎవరూ తక్కువ అంచనా వేయడంలేదు. 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే దక్కి ఒక విధంగా చావు దెబ్బ తిన్న పార్టీని నాలుగేళ్ళు తిరగకుండానే గెలుపు గుర్రాన్ని చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ పని చంద్రబాబు చేసి చూపించారు.

ఏపీలో చూస్తే 2022 మధ్య దాకా వైసీపీ అత్యంత బలంగా ఉంటూ వచ్చింది. చంద్రబాబు జిల్లా టూర్లతో పరిస్థితిలో మార్పు తెచ్చారు. అదే విధంగా పడకేసిన క్యాడర్ ని లీడర్ ని తట్టి లేపారు. ఇంకో వైపు పొత్తుల విషయంలోనూ ఏ మాత్రం ఇగోస్ కి పోకుండా బాబు చురుకుగా పావులు కదిపారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లారు అంటే దానికంటే ముందు విజయవాడలోని పవన్ బస చేసిన హొటల్ కి బాబు వచ్చారు అన్నది మరచిపోకూడదు.

మొత్తానికి జనసేనతో పొత్తులను కుదుర్చుకున్నారు చంద్రబాబు అని అంటున్నారు. దీంతోనే తెలుగుదేశానికి గెలుపు కళ వచ్చేసింది అని అంటున్నారు. ఏపీలో తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి రాబోతోంది అని అంచనాకు చాలా మంది వస్తున్న నేపధ్యం ఉంది. అయితే పక్కాగా తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పడానికి ఒక కీలకమైన పరిణామం జరిగింది.

అదే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ లోని నారా లోకేష్ నివాసానికి వెళ్ళి కలవడం. గంటా చంద్రబాబు వరకూ ఎపుడూ బద్ధుడిగా ఉన్నారు. కానీ లోకేష్ వారసత్వాన్ని పెత్తనాన్ని ఆయన అంగీకరించలేదని ప్రచారం అప్పట్లో సాగింది. దానికి తోడు గంటాకు కాకుండా ఉమ్మడి విశాఖ జిల్లాలో సొంత పార్టీలో తన రాజకీయ ప్రత్యర్ధి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి నారా లోకేష్ సన్నిహితుడు, ఆయనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న భావన కూడా గంటా వర్గంలో ఉంటూ వచ్చింది.

దాంతో ఆయన టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఎక్కడా కూడా సందడి చేయలేదు. ఈ నేపధ్యంలో గంటా వైసీపీలోకి వెళ్తారు అని ఒక దశలో జోరుగా ప్రచారం సాగింది. మరో వైపు చూస్తే జనసేనలోకి ఆయన వెళ్తారు అని అంటూ వచ్చారు. కానీ గంటా ఇపుడు నారా లోకేష్ వద్దకు వెళ్ళి చర్చలు జరపడం అంటే రాజకీయంగా ఆసక్తిని పెంచే పరిణామమే. గంటా లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించారు అని అంటున్నారు.

అదే టైం లో గంటా ఈ స్టెప్ తీసుకోవడం వెనక బలమైన కారణం ఉంది అంటున్నారు. ఏపీలో జనసేన టీడీపీ పొత్తులలోకి వెళ్తే కచ్చితంగా అధికారం దక్కుతుంది అన్న అంచనాలు ఆయనకు ఉన్నాయని అంటున్నారు. గంటా ఎపుడూ గెలిచే పార్టీలోనే ఉంటారు. 2019లో కూడా ఆయన వైసెపీలోకి వెళ్లాల్సింది చివరి నిముషంలో తప్పిపోయింది. అంటే ఆయనకు నాడు టీడీపీ ఓడిపోతుందని తెలుసు.

మరి ఇపుడు కూడా గంటాకు కచ్చితమైన లెక్కలు పక్కాగా ఉండబట్టే నారా లోకేష్ తో భేటీ అయ్యారని అంటున్నారు. మరి విశాఖ ఆక్టోపస్ గా పేరుపడిన గంటా టీడీపీకి నారా లోకేష్ కి జై కొడుతున్నారు అంటే వైసీపీ విజయావకాశాల మీద ఆయనకు నమ్మకం పూర్తిగా తగ్గినట్లే అంటున్నారు. మొత్తానికి గంటా లో వచిన ఈ బిగ్ చేంజి ని చూసిన వారు ఫ్యాన్ పార్టీకి అపశకునాలు ఇవే అంటున్నారుట.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.