Begin typing your search above and press return to search.

ప్ర‌శాంత్ కిషోర్ పెద్ద బాంబు పేల్చాడు

By:  Tupaki Desk   |   5 May 2022 8:53 AM GMT
ప్ర‌శాంత్ కిషోర్ పెద్ద బాంబు పేల్చాడు
X
గ‌త కొద్దిరోజులుగా వార్త‌ల్లో వ్య‌క్తిగా మారిన ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తాజాగా మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా పీకే పని చేయబోతున్నారని, త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు హ‌ల్‌చ‌ల్ చేయ‌డం, అయితే కాంగ్రెస్ తో తాను కలిసి పని చేద్దామనుకున్న విషయం వాస్తవమేనని, కొన్ని కారణాల రీత్యా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు పీకే అనంతరం ప్రకటించడం తెలిసిన సంగ‌తే. అనంత‌రం, బీహార్ కేంద్రంగా తాను ప‌ని చేస్తాన‌ని పీకే వెల్ల‌డించారు. దీనికి కొన‌సాగింపుగా తాజాగా బీహార్‌లో పాద‌యాత్ర చేయ‌నున్న‌ట్లు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

బీహార్ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేయనున్నట్లు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకోడానికి త్వరలోనే పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. అక్టోబ‌ర్ 2వ తేదీ నుంచి మూడు వేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

త‌న పాద‌యాత్ర‌లో వీలైనంత మందిని క‌ల‌వ‌నున్న‌ట్లు పీకే చెప్పారు. దాదాపు ఏడాదిపాటు సాగే ఈ యాత్రలో రాష్ట్రంలోని ప్రతి తలుపు తడతానని పేర్కొన్నారు.

ప్రజల అభివృద్ధి కోసం తన శక్తినంతా ధార పోస్తానని... ఎట్టి పరిస్థితుల్లో తన ఈ ప్రయత్నాన్ని మధ్యలో వదిలేయబోనని బీహార్ ప్రజలకు వాగ్దానం చేస్తున్నటు పీకే చెప్పారు. బీహార్‌లో ఇప్పుడేమీ ఎన్నిక‌లు లేవ‌ని, ఇక ఇప్ప‌ట్లో రాజ‌కీయ పార్టీని స్థాపించే ప్ర‌ణాళిక ఏదీ లేదని తెలిపారు.

ఇక నుంచి తాను పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ను ఏమాత్రం కానని, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడినని ప్ర‌శాంత్ కిషోర్‌ స్పష్టం చేశారు. సుపరిపాలన అంటే ఏంటో ప్రజలకు తెలియజేస్తానని... గతంలో చేసిన తప్పును మళ్లీ చేయబోనని నితీష్ కుమార్ కు ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా పని చేసిన విషయం గురించి ప‌రోక్షంగా చెప్పారు.

ఇక నుంచి ఐ ప్యాక్ సంస్థకు తనకు ఎలాంటి డైరెక్ట్ సంబంధం లేదని ప్రకటించారు. రాబోయే మూడు లేదా నాలుగేళ్లు ప్ర‌జ‌లకు చేరువ‌య్యే ప‌నిలో నిమ‌గ్నం కానున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. కాగా, పాద‌యాత్ర ముగిసిన అనంత‌రం రాజ‌కీయ పార్టీని పీకే ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.