Begin typing your search above and press return to search.

వైఎస్ ఆత్మ పలికింది...అల్లుడు గుట్టు చెబుతారా...?

By:  Tupaki Desk   |   13 Dec 2022 2:30 AM GMT
వైఎస్ ఆత్మ పలికింది...అల్లుడు గుట్టు చెబుతారా...?
X
అల్లుడు అంటే ఇక్కడ ఎవరో కాదు ఏపీ సీఎం జగన్ అన్న మాట. మామ అంటే పిల్లనిచ్చిన మామ కాదు వైఎస్సార్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు. వైఎస్సార్ కుటుంబంలో జగన్ ఆయన్ని మామా అని పిలుస్తారు. అవును కేవీపీ వైఎస్సార్ ల బంధం ఈనాటిది కాదు. దశాబ్దాల కాలం నాటిది. ఇద్దరూ కలసి మెలసి ఉండేవారు. ఇద్దరూ డాక్టర్ కోర్స్ చదివారు. ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు.

వైఎస్సార్ ప్రతి అడుగులో ఆయన ఎదుగుదలలో కేవీపీ ఉన్నారని అంటారు. ఇక వైఎస్సార్ ఇంటికి ఆయన ఆత్మబంధువు. వైఎస్సార్ జీవితం అంతా ఆయనకు తెలుసు. ఆప్త మిత్రుడు అకాలమరణం తట్టుకోలేక కేవీపీ ఆనాడు ఎంత తల్లడిల్లారు అన్నది అంతా చూశారు. వైఎస్సార్ మరణం తరువాత జగన్ కాంగ్రెస్ నుంచి వేరుపడ్డారు. సొంత పార్టీ పెట్టుకున్నారు. అల్లుడూ అని చనువుగా పిలిచే కేవీపీ అంతటి సాన్నిహిత్యాన్ని కాదనుకుని కాంగ్రెస్ లో ఉండిపోయారు.

దానికి కారణం ఆయన తాజాగా విజయవాడలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ లో చెప్పుకొచ్చారు. తానూ వైఎస్సార్ తమకు అన్నీ ఇచ్చిన కాంగ్రెస్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి వెళ్లకూడదని ఒట్టుపెట్టుకున్నామని కేవీపీ ఫ్లాష్ బ్యాక్ చెప్పారు. అంతటితో ఆగారా ఆయన ఏకంగా జగన్ మీద విరుచుకుపడ్డారు. ఏపీని జగన్ అన్ని విధాలుగా నాశనం చేశారని అల్లుడు అని కూడా చూడకుండా చెడుగుడు ఆడేశారు.

ఏపీలో పోలవరం పడకేసిందని, ప్రత్యేక హోదా అతీ గతీ లేదు, ఆఖరుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తున్నా జగన్ నోరెత్తడం లేదని కేవీపీ మండిపడ్డారు. తన ప్రాణ స్నేహితుడు కుమారుడు జగన్ సీఎం గా ఉండగా ఒక్క మాట కూడా ఇప్పటిదాకా వ్యతిరేకంగా మాట్లాడని కేవీపీ ఫస్ట్ టైం అలా విరుచుపడడాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇది వార్తగా బయటకు వచ్చాక చూసిన వారు అంతా కూడా షాక్ తిన్నారు.

వైఎస్సార్ ఆత్మగా అంతా చెప్పుకునే కేవీపీ జగన్ మీద ఇంతలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ మూడేళ్ల పాలనను ఆయన జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారని, ఆ మీదటనే ఆయన నోరు విప్పారని అంటున్నారు. అంతే కాదు వైఎస్ విజయమ్మ ఈ మధ్యన జరిగిన వైసీపీ ప్లీనరీలో తన పదవికి రాజీనామా చేశారు. ఆమెకు వైసీపీతో ఏ రకమైన రిలేషన్స్ లేవు.

దాంతో ఇపుడు కేవీపీ జగన్ని గట్టిగా టార్గెట్ చేశారు అని అంటున్నారు. వైఎస్సార్ కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న కేవీపీ వైఎస్ విజయమ్మ పట్ల గౌరవ భావంతో ఉంటారు. ఆమె గౌరవ అధ్యక్షురాలిగా ఇంతవరకూ వైసీపీలో ఉన్నారు కాబట్టి తాను గట్టిగా విమర్శలు చేస్తే ఆమె నొచ్చుకుంటారేమో అని ఇంతకాలం ఆగారని అంటున్నారు. అయితే ఇపుడు మాత్రం ఆమె లేకపోవడంతో కేవీపీ తన ఆగ్రహం ఏంటో చూపించారు అని అంటున్నారు.

అంతే కాదు అల్లుడు జగన్ గురించి తనకు మాత్రమే తెలిసిన అనేక విషయాలను కూడా ఆయన ముందు ముందు జనంతో పంచుకుంటారా అన్న చర్చ ఉంది. కేవీపీ కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీతో కలసివస్తారని అంతా అనుకున్నారు అది జరగలేదు. పైగా ఎవరైనా వైసీపీలో చేరుతామంటే కేవీపీని కలసినపుడు ఆయన అల్లుడికీ మీకు కుదిరే ప్రసక్తి లేదు అని ముఖం మీదనే చెప్పేసేవారట. అంతలా జగన్ గురించి చదివేసిన కేవీపీ రానున్న రోజుల్లో ఏపీ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరిస్తూ జగన్ మీద బాణాలు వేస్తే మాత్రం తట్టుకోవడం కష్టమేనా అన్న చర్చ అయితే ఉంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.