Begin typing your search above and press return to search.

టీఆర్పీ స్కాం: రేటింగ్ నిలిపివేస్తూ ‘బార్క్’ సంచలనం

By:  Tupaki Desk   |   15 Oct 2020 3:30 PM GMT
టీఆర్పీ స్కాం: రేటింగ్ నిలిపివేస్తూ ‘బార్క్’ సంచలనం
X
ముంబైలో వెలుగుచూసిన టీఆర్పీ స్కాంతో కొన్ని జాతీయ న్యూస్ చానెల్స్ ఫేక్ టీఆర్పీ కోసం అక్రమాలకు పాల్పడ్డట్టు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. మీటర్లు పెట్టి తమ చానెల్స్ చూసేలా జనాలకు డబ్బులు ఇచ్చి మరీ ఈ దందా చేసినట్టు ముంబై పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఇది దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఆ చానెళ్ల పరువు కూడా పోయింది. ఈ క్రమంలోనే బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) సంచలన నిర్ణయం తీసుకుంది.

హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ న్యూస్ చానెల్స్ తోపాటు బిజినెస్ న్యూస్ చానెల్ వ్యూయర్ షిప్ రేటింగ్ ను ఎప్పటికప్పుడు విడుదల చేసే బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా న్యూస్ చానెల్ ల వ్యూయర్ షిప్ రేటింగ్ ను 12 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. దీంతో ఈ వారం విడుదల చేయాల్సిన న్యూస్ చానెల్ ల వ్యక్తిగత రేటింగ్ ను బార్క్ ప్రకటించడం లేదని తెలిపింది.

ప్రస్తుతం టెలివిజన్, న్యూస్ చానెల్ లో జరుగుతున్న సాంకేతిక లోపాల దృష్ట్యా బార్క్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. రేటింగ్ గణాంకాలను మెరుగుపరచడంతోపాటు ప్యానెల్ గృహాలలోకి చొరబడే సంభావ్యత ప్రయత్నాలను కూడా గణనీయంగా దెబ్బతీస్తుందని పేర్కొంది.

టెక్ కామ్ పర్యవేక్షణలో జరిగే ప్రయోగానికి 8-12 వారాల సమయం పడుతుందని.. ఈ నేపథ్యంలో టీవీ, న్యూస్ చానెల్ ల రేటింగ్ ను 12 వారాలు నిలిపివేస్తున్నట్లు బార్క్ తన ప్రకటనలో వివరించింది.

బార్క్ నిర్ణయాన్ని న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ (ఎస్.బీ.ఏ) కూడా స్వాగతించింది. బ్రాడ్ కాస్టింగ్ రేటింగ్స్ ను వెల్లడించే క్రమంలో రేటింగ్ ఏజెన్సీకి, ప్రసార వార్త మాధ్యమాలకు అపశ్యాతిని తెస్తోందని.. ప్రజలు అసలు ఏం చూస్తున్నారో దానిపై ఖచ్చితమైన రేటింగ్ ఇవ్వడంలో కూడా తప్పుడు కథనాలు వచ్చాయన్నారు.