Begin typing your search above and press return to search.

లాభాలలో తగ్గేదే లే అంటున్న విశాఖ ఉక్కు

By:  Tupaki Desk   |   10 April 2022 7:37 AM GMT
లాభాలలో తగ్గేదే లే అంటున్న విశాఖ ఉక్కు
X
అవును. విశాఖ ఉక్కు కర్మాగారం ఆషామాషీది కాదు. అసలు దీని ఆవిర్భావమే ఎంతో ఘనమైనది. అలాంటి ఉక్కుని ఏమీ కాకుండా ప్రైవేట్ చేస్తామని కేంద్రం భీష్మించుకుని కూర్చుంది. దానికి వారు పదే పదే చెబుతున్న మాట ఏంటి అంటే విశాఖ ఉక్కు నష్టాలలో కూరుకుపోయిందని. అందుకే తాము నిర్వహించలేకపోతున్నామని.

అయితే విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవు, తగిన ప్రోత్సాహం కేంద్రం నుంచి లేదు, అది కనుక ఉంటే ఏనాడో లాభాల బాట పట్టేది అన్నది కార్మిక సంఘాల వాదన. ఇక సొంత గనులు లేకపోయినా ఉక్కు అనేక సందర్భాలలో లాభాలను చవిచూసింది. రెండేళ్ళుగా ఉక్కు ప్రైవేట్ బలిపీఠం మీద ఉంది.

దాంతో ఉక్కుని ప్రైవేట్ పరం చేయవద్దు అంటూ ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కార్మిక లోకం అంతా గట్టి పట్టుదలతో పనిచేస్తోంది. గతం కంటే ఎక్కువ ఉత్పత్తిని సాధిస్తూ రికార్డులను ఒక వైపు బద్ధలు కొడుతోంది. ఇపుడు ఆరేళ్ళ తరువాత మళ్లీ విశాఖ ఉక్కు లాభాల బాటలోకి వచ్చింది.

నిజంగా ఇంతటి కీలకమైన సమయంలో విశాఖ ఉక్కు లాభాలను చూడడం అంటే నిజంగా గొప్పగా చెప్పుకోవాలి. విశాఖ ఉక్కు 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 835 కోట్ల రూపాయల లాభాలను సాధించింది. ఈ విషయాన్ని విశాఖ ఉక్కు కర్మాగారం ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ భట్ తెలియచేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే స్టీల్ ప్లాంట్ 2021-22లో అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది అని చెప్పుకోవాలి.

అలాగే, ఉక్కు కర్మాగారం అత్యుత్తమ అమ్మకాల టర్నోవర్‌ ను కూడా సాధించింది. దీని విలువ 28, 082 కోట్లుగా పేర్కొంటున్నారు. ఇది మునుపటి టర్నోవర్ కంటే 35 శాతం ఎక్కువగా తెలియచేస్తున్నారు ఇక విశాఖ ఉక్కు కర్మాగారం ఈ రకమైన లాభాలు గడించడం వెనక సమిష్టిగా పని చేసిన విధానం ఉందని అంటున్నారు.

అలాగే, స్థూల మార్జిన్ గ 3,575 కోట్లు ఆర్ద్జించిందని ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ భట్ వివరిస్తున్నారు. అంతే కాదు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్ని ప్రధాన ఉత్పత్తి యూనిట్లలో అత్యుత్తమ ఉత్పత్తి గణాంకాలను సాధించడం కోసం పెద్ద ఎత్తున జరిగిన కృషిని ఆయన కొనియాడారు. నిజంగా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ విశాఖ ఉక్కు ఈ స్థాయిలో లాభాలను ఆర్జించడం అంటే మెచ్చుకుని తీరాలి.

ఇక్కడ ఒక విషయం ప్రస్థావించాలి. విశాఖ ఉక్కు నష్టాల బాట పడుతోంది అనే కదా ప్రైవేట్ పరం చేస్తామని అంటున్నారు. ఇపుడు లాభాల బాటలోకి వచ్చింది కాబట్టి ప్రైవేట్ ప్రతిపాదన కేంద్రం విరమించుకుంటుందా అని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఆ దిశగా కేంద్రం వెనక్కు తగ్గి విశాఖ ఉక్కుని తగిన ఊతం ఇస్తే కనుక తప్పకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే నంబర్ వన్ ర్యాంక్ కి చేరుకుంటుందని అంతా అంటున్నారు. మరిపుడు కేంద్రం ఈ లాభాలను చూసి పునరాలోచన చేస్తుందా అన్నది చూడాలి.