Begin typing your search above and press return to search.

ఉక్కుకు మద్దతుగా సంతకాలు చేయని టీడీపీ ఎంపీలు

By:  Tupaki Desk   |   2 April 2022 8:44 AM GMT
ఉక్కుకు మద్దతుగా సంతకాలు చేయని టీడీపీ ఎంపీలు
X
విశాఖపట్నంలోని ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయవద్దంటూ 120 మంది ఎంపీలు మద్దతుగా నిలిచారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు నరేంద్ర మోడీ సర్కార్ చాలా స్పీడుగా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసింది. రాష్ట్రంలోని ఎంపీలు పార్లమెంటులో కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడారు. అఖిల పక్షాలు నిరసనలు తెలుపుతున్నాయి.

చివరకు ఉక్కు ఫ్యాక్టరీలోని ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. తన నిర్ణయానికి వ్యతిరేకంగా ఇన్ని జరుగుతున్నా కేంద్రం మాత్రం ముందుకే వెళుతోంది. ఈ నేపధ్యంలోనే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అఖిలపక్షం నేతల ఆధ్వర్యంలో ఎంపీల సంతకాల సేకరణ మొదలైంది. కేంద్రం వైఖరికి నిరసనగా 120 మంది ఎంపీల సంతకాలను సేకరించిన అఖిలపక్షం నేతలు దాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి అందించారు.

విచిత్రమేమింటటే కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా ఇంతమంది సంతకాలు చేసినా టీడీపీ ఎంపీలు మాత్రం సంతకాలు చేయలేదు. సంతకాలు చేసిన వారిలో వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, శివసేన, ఐయూఎంఎల్, ఆర్జేడీ, ఎన్సీపీ, బీఎస్పీ, డీఎంకే, ఎంఐఎం, ఆర్ఎల్డీ, ఆర్ఎస్పీ, కేసీ (ఎం), తృణమూల్ కాంగ్రెస్, బీజేడీకి చెందిన 120 మంది ఎంపీలు సంతకాలు చేశారు. మరింతటి కీలకమైన పత్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఎందుకని సంతకాలు చేయలేదు ?

రాష్ట్రంతో కానీ ఉక్కు ఫ్యాక్టరీతో కానీ ఏమాత్రం సంబంధం లేని ఎన్నో పార్టీల ఎంపీలు మాత్రం ఉద్యమకారులు అడగ్గానే సంతకాలు చేశారు. అయితే రాష్ట్రానికి చెందిన ముగ్గురు టీడీపీ ఎంపీలు మాత్రం సంతకాలు చేయటానికి నిరాకరించారు. ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో టీడీపీ వైఖరి బయటపడిందన్నారు. సంతకాలు చేయమని తాము అడిగినా టీడీపీ ఎంపీలు నిరాకరించినట్లు చెప్పారు. మరి టీడీపీ ఎంపీలు ఎందుకు సంతకాలు చేయలేదో వాళ్ళే చెప్పాలి.